Chandrababu: పోలవరం పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 89.9 శాతం సివిల్ పనులు పూర్తి!
Chandrababu: పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతితో పాటు రాష్ట్రంలో నీటి నిల్వలు, నీటి విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాల్సిన 36 ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, వర్షపాతం లోటు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.
పోలవరం పనులకు మరింత వేగం.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధప్రాతిపదికన.. సీఎం చంద్రబాబు సమీక్ష..
అమరావతి: పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతితో పాటు రాష్ట్రంలో నీటి నిల్వలు, నీటి విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాల్సిన 36 ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, వర్షపాతం లోటు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.
రాష్ట్రంలో నీటి లభ్యత, రిజర్వాయర్లలో నిల్వలు, అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. తక్కువ వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. జలధార–జలహారతి కార్యక్రమాల అమలుపైనా దిశానిర్దేశం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటివరకు 89.9 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రాజెక్టులో కీలకమైన ఎడమ కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.
ఈసీఆర్ఎఫ్ డ్యామ్లోని గ్యాప్-1, గ్యాప్-2 పనులను కూడా శరవేగంగా చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. డ్యామ్ సైట్ వద్ద రోడ్లు వంటి మౌలిక వసతుల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు.
ఇటీవల పోలవరం ప్రాంతంలో భారీగా వరద ప్రవాహాలు వచ్చినప్పటికీ ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా కొనసాగించామని అధికారులు తెలిపారు. ఒక దశలో 14 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం వచ్చినా పనులు కొనసాగినట్లు సీఎంకు వివరించారు.
పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు. స్థానికుల విశ్వాసాలు, సెంటిమెంట్కు ప్రాధాన్యం ఇస్తూ ఆలయ పరిరక్షణకు తగిన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడంతో పాటు భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Be the first to react