Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్!
Hostel Facilities: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సాంఘిక సంక్షేమ వసతిగృహాల పరిస్థితిపై చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో వేలాది మంది విద్యార్థులకు మంచాల కొరత ఉందని మంత్రి బాల వీరాంజనేయస్వామి తెలిపారు. హాస్టళ్లలో 94 వేల మంచాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 5…
రెసిడెన్షియల్ పాఠశాలల్లో 52 వేల మంచాల కొరత…
దశలవారీగా పడకల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో భద్రత, సౌకర్యాలపై చర్చ…
Hostel Facilities: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సాంఘిక సంక్షేమ వసతిగృహాలు (హాస్టళ్లు), రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొన్న వసతుల కొరతపై ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమాధానమిస్తూ రాష్ట్రంలోని వసతిగృహాల ప్రస్తుత స్థితిగతులను వివరించారు. ముఖ్యంగా విద్యార్థుల భద్రత, వారు పడుకునేందుకు అవసరమైన కనీస సౌకర్యాలైన మంచాల కొరతపై మంత్రి కీలక గణాంకాలను సభ ముందు ఉంచారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో సుమారు లక్షా 4 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు. అయితే, వీరందరికీ సరిపడా పడకలు అందుబాటులో లేవని ఆయన అంగీకరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంకా 52 వేల మంచాలు అవసరమని గుర్తించామని చెప్పారు. ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, దశలవారీగా నిధులు సమకూర్చుకుని విద్యార్థులకు అవసరమైన మంచాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇక సాంఘిక సంక్షేమ వసతిగృహాల (హాస్టళ్ల) పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ వసతిగృహాల్లో మొత్తం 96 వేల మంది విద్యార్థులు ఉంటుండగా, కేవలం 700 మంచాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. అంటే దాదాపు 94 వేల మందికి పైగా విద్యార్థులు నేల మీద పడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ భారీ వ్యత్యాసాన్ని తగ్గించి, ప్రతి విద్యార్థికి గౌరవప్రదమైన వసతి కల్పించడం ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.
వసతిగృహాల్లో మంచాలు ఏర్పాటు చేయకపోవడానికి కేవలం నిధుల కొరత మాత్రమే కారణం కాదని, భవనాల పరిస్థితి కూడా ఒక ప్రధాన సమస్య అని మంత్రి వివరించారు. చాలా వసతిగృహాలు పాత భవనాల్లో నడుస్తున్నాయని, అక్కడ గదుల విస్తీర్ణం తక్కువగా ఉండటం వల్ల మంచాలు వేసేందుకు సరిపడా స్థలం (వెసులుబాటు) లేదని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భవిష్యత్తులో నూతన భవనాల నిర్మాణంపై కూడా దృష్టి పెడతామని చెప్పారు.
Be the first to react