వీసా విధానంలో చైనా కీలక మార్పులను తీసుకొచ్చింది. వీసా దరఖాస్తు విధానాన్ని సరళీకృతం చేసింది. ఇందుకోసం ఈనెల 22న ఆన్లైన్ వీసా దరఖాస్తు వ్యవస్థను అధికారికంగా ప్రారంభించనున్నట్లు భారత్లోని చైనా రాయబారి క్సూ ఫైహాంగ్ సోమవారం ప్రకటించారు.
ఈ కొత్త వ్యవస్థ ద్వారా చైనా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇకపై ఆన్లైన్ సదుపాయాన్ని వినియోగించవచ్చు. అవసరమైన దరఖాస్తు పత్రాలను అప్లోడ్ చేయవచ్చు. ఈ మేరకు భారత్లోని చైనా రాయబారి ఫైహాంగ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా దరఖాస్తు దారులు పూర్తి వివరాల కోసం https://visaforchina.cn/DEL3_EN/qianzhengyewu అధికారిక వెబ్సైట్ సంప్రదించవచ్చునని భారత్లోని చైనా రాయబారి ఫైహాంగ్ పేర్కొన్నారు. ఇందులో వీసా దరఖాస్తుకు సంబంధించిన వివరాలు, ఫారమ్లు ఆన్లైన్లో పొందుపరుచువచ్చునని పేర్కొన్నారు.
అంతకుముందు 2025 నవంబరు 26న, చైనా జాతీయులకు పర్యటక, వ్యాపార ప్రయోజనాల కోసం వీసా ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇకపై చైనా జాతీయులకు పర్యాటక వీసా ప్రక్రియ కొనసాగుతుందని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
2020లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అలాగే, చైనా సైన్యానికి కూడా భారీ నష్టం వాటిల్లింది. ఈ వివాదాల అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వీసా ప్రక్రియ, విమాన సర్వీసులను సైతం నిలిపివేశారు.
అయితే, ఇటీవల లద్దాఖ్ సరిహద్దులో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం, విమాన సర్వీసుల పునరుద్ధరణ, కైలాస మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం వంటి విషయాల్లో ఇరుదేశాలు పలు ఒక అవగాహనకు వచ్చాయి.
దీంతో భారత్, చైనాల మధ్య సంబంధాలు కొంతవరకు మెరుగుపడ్డాయి. అంతకుముందు చైనీయులకు భారత్ టూరిస్టు వీసాల జారీ ప్రక్రియను పునః ప్రారంభిస్తున్నట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. జులై 24 నుంచి చైనా పౌరులకు టూరిస్టు వీసాలు మంజూరుచేయనున్నట్లు తెలియజేసింది.
2024 అక్టోబరు నుంచే తూర్పు లద్దాఖ్లోని ఎల్ఏసీ వద్ద సైనిక ఉద్రిక్తతలు తగ్గాయి. దీంతో భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా అడుగులు పడే ప్రక్రియ మొదలైంది. సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలనే ఏకాభిప్రాయానికి భారత్ - చైనా వచ్చాయి.
ఈ ఏడాది ఆగస్టులో రష్యాలోని టియాంజిన్ వేదికగా జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 2024 సంవత్సరంలో చైనాతో భారత్ 127 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిపింది.
ఇందులో 109 బిలియన్ డాలర్లు చైనా ఎగుమతుల నుంచే వచ్చింది. ఓ వైపు సరిహద్దులపై విభేదాలున్నా, మరోవైపు వాణిజ్యపరంగా భారత్ - చైనా బంధం కొనసాగుతున్న తీరుకు ఈ గణాంకాలే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.