Hormuz Strait Conflict: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్పై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశాన్ని ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను టెహ్రాన్ కొట్టిపారేసింది. ఇరాన్ సైనిక కమాండ్ ప్రతినిధి మాట్లాడుతూ, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని, అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలపై తమ దాడులు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం వారి సైనిక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికేనని ఇరాన్ ఎద్దేవా చేసింది.
పశ్చిమాసియాలో పరిస్థితులు నిమిషనిమిషానికి మారిపోతున్నాయి. హర్మూజ్ జలసంధి విషయంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే గత కొద్ది వారాలుగా అమెరికా వైమానిక దళం ఇరాన్లోని వేల సంఖ్యలో ఉన్న లక్ష్యాలపై విరుచుకుపడుతోంది. విద్యుత్ కేంద్రాలు, వంతెనలు రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని అమెరికా వెల్లడించింది. అయితే, తమ దాడులు మరింత తీవ్రం అవుతాయని ఇరాన్ సైన్యం కూడా హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు, ఇరాన్ గడ్డపై చిక్కుకుపోయిన ఒక ఎఫ్-15 పైలట్ను కాపాడేందుకు అమెరికా సైన్యం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. సుమారు 200 మంది సైనికులు ప్రాణాలకు తెగించి ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే, ఈ ఆపరేషన్ వివరాలను ఎవరో బయటపెట్టడం వల్లే తమ సైనికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని వైట్ హౌస్ ప్రకటించింది.
ఈ యుద్ధం విషయంలో మిత్రదేశాల తీరుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జపాన్, దక్షిణ కొరియా, నాటో దేశాలు అమెరికాకు ఆశించిన స్థాయిలో సహకరించలేదని ఆయన విమర్శించారు. అదే సమయంలో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాలు తమకు అండగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. యుద్ధాన్ని ముగించాలంటే అమెరికా సూచించిన 15 పాయింట్ల ప్రణాళికకు ఇరాన్ అంగీకరించాలని, లేనిపక్షంలో దాడులు మరింత ఉధృతం చేస్తామని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు.
ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన వస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం క్షిపణి దాడులు ఆగడం లేదు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వరకు ట్రంప్ ఇచ్చిన గడువు ముగియనుంది. ఈ లోగా ఇరాన్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా లేక యుద్ధం మరో మలుపు తిరుగుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.