ఇండోనేషియా రాజధాని జకార్తాలో మంగళవారం (డిసెంబర్ 9) ఓ ఏడంతస్తుల కార్యాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే భవంతి అంతటా వ్యాపించాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నప్పటికీ, మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో భవనంలో చిక్కుకున్న వారిని కాపాడడం కష్టమైంది.
ప్రమాదంలో మరణించిన వారిలో 15 మందికి పైగా మహిళలు ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక గర్భిణి మహిళ కూడా ఉన్నట్లు చెప్పారు. మంటల కారణంగా ఏర్పడిన దట్టమైన పొగను పీల్చడం వల్ల చాలామంది ఊపిరాడక మృతి చెందినట్టు ప్రారంభ అంచనా. గాయపడిన కొందరిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. రక్షణ చర్యలు కొనసాగుతుండగా, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది.
ఈ ప్రమాదానికి కారణం భవనం మొదటి అంతస్తులో జరిగిన ఓ బ్యాటరీ పేలుడేనని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. పేలుడు ధాటికి మంటలు ఒక్కసారిగా పై అంతస్తులకు వ్యాపించాయి. భవనం లోపల ఉన్న ఉద్యోగులు బయటకు పరుగెత్తేందుకు అవకాశం లేకపోవడంతో మరణాల సంఖ్య పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన తర్వాతే శవాలను వెలికితీస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యాలయ భవనం ‘టెర్రా డ్రోన్ ఇండోనేషియా’కి చెందినదిగా గుర్తించారు. ఈ సంస్థ మైనింగ్, వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగించే డ్రోన్ల తయారీ, సర్వే సేవలు అందిస్తోంది. గతంలో కూడా ఇండోనేషియాలో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 2023లో తూర్పు ఇండోనేషియాలోని నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్లో జరిగిన పేలుడు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 39 మంది గాయపడిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీ పేలుడు ఎలా జరిగిందన్న దానిపై సాంకేతిక నిపుణులను కూడా తీసుకువచ్చి పరిశీలిస్తున్నారు. భవన నిర్మాణం, భద్రతా ప్రమాణాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలపై కూడా అధికారులు పరిశీలన ప్రారంభించారు. ఈ ఘటన మరోసారి ఇండోనేషియాలో భవన భద్రతా నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తింది.