Amaravati Quantum Valley: భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా అమరావతి మారుతోంది. ఐటీ రంగంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు 'క్వాంటం టెక్నాలజీ'పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి క్వాంటం హార్డ్వేర్ టెస్ట్ బెడ్లను అమరావతిలో ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీన ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా వీటిని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు. కేవలం ఎనిమిది నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం.
రాష్ట్ర రాజధానిని గ్లోబల్ క్వాంటం హబ్గా మార్చాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దీని కోసం విజయవాడలోని మేధా టవర్స్, అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీల్లో రెండు ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిని 'భారత్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్' అని పిలుస్తారు. ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 'అమరావతి 1ఎస్', 'అమరావతి 1క్యూ' అనే రెండు చిన్న క్వాంటం కంప్యూటర్లను అమర్చారు. క్యూబిట్ ఫోర్స్ అనే స్టార్టప్ సంస్థ ఈ కంప్యూటర్ల తయారీలో కీలక పాత్ర పోషించింది.
ఈ ప్రాజెక్టు వెనుక దేశంలోని అగ్రశ్రేణి పరిశోధనా సంస్థల కృషి ఉంది. ముంబయిలోని టీఐఎఫ్ఆర్, బెంగళూరులోని ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు క్వాంటం అందించాయి. అలాగే డీఆర్డీవో శాస్త్రవేత్తలు కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో సహకరించారు. ప్రైవేటు సంస్థలైన ఆంబర్ ఎంటర్ప్రైజెస్, క్యూట్ ఎలక్ట్రానిక్స్ తమవంతుగా హార్డ్వేర్ భాగాలను సమకూర్చాయి. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు చేతులు కలపడం వల్ల అమరావతిలో క్వాంటం విడిభాగాల తయారీకి గట్టి పునాది పడింది.
ఈ టెస్ట్ బెడ్ల వల్ల పరిశోధకులకు, విద్యార్థులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా క్వాంటం చిప్లను పరీక్షించాలంటే మన దేశంలో సరైన వసతులు లేక విదేశాలకు పంపాల్సి వచ్చేది. దీనివల్ల సమయం, డబ్బు వృథా అయ్యేవి. ఇప్పుడు అమరావతిలోనే ఈ పరీక్షలు చేసుకునే వీలుంటుంది. కేవలం థియరీ చదువులకే పరిమితం కాకుండా, విద్యార్థులు నేరుగా ఈ కంప్యూటర్లపై ప్రయోగాలు చేసే అవకాశం కలగడం ఒక గొప్ప మార్పుగా చెప్పవచ్చు.
రాబోయే రోజుల్లో అమరావతిని క్వాంటం హార్డ్వేర్ తయారీ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు 111 క్యూబిట్స్ వరకు ఉన్న ప్రాసెసర్లను ఇక్కడ పరీక్షించవచ్చు. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని పది లక్షల (మిలియన్) క్యూబిట్స్ వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు రావడమే కాకుండా, ఉన్నత విద్యావంతులైన యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.