ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు చిత్రం కింగ్డమ్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ భోర్సే కీలక పాత్రల్లో నటించారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దాదాపు చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించారు. సుమారు ఏడాదిన్నర పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈరోజే థియేటర్లలోకి విడుదలైంది. ఇప్పటికే ఇండియాలోని కొన్ని ప్రాంతాలు మరియు ఓవర్సీస్లో షోలు ప్రారంభమయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.
చిత్ర కథ ఒక కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. శ్రీలంకలోని ఓ దీవిలో గ్యాంగ్స్టర్లు, స్మగ్లర్లతో పాటు తన అన్నయ్య చిక్కుల్లో ఉన్నాడని తెలుసుకున్న హీరో, ఒక స్పైగా ఆ దీవికి చేరుతాడు. అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు, దీవిలో వలస జీవులలో ఒకరిగా మారడం, ఆ తెగకు లీడర్గా ఎదగడం వంటి అంశాలతో సినిమా కథ కొనసాగుతుంది. సినిమా ప్రారంభం నుంచే విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ ఆర్మీలా కనిపించడంతో పాటు, కథ రొటీన్ అయినప్పటికీ దర్శకుడు గౌతమ్ టేకింగ్, స్క్రీన్ప్లే ద్వారా సినిమాను బలంగా నడిపించిన తీరు ప్రశంసలందుకుంటోంది. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగినా, క్లూస్ ఇవ్వకుండా కథను గ్రిప్పింగ్గా ఉంచడం బావుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ సత్తా చూపించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్ రైడ్గా మారిందని, అక్కడ కథా పరంగా హీరో ఎలా దీవి రాజుగా మారాడో చూపించిన విధానం గూస్బంప్స్ తెప్పించేదిగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని, రియలిస్టిక్ టచ్తో సీన్లు తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్లో ఏర్పడిన కథకు సెకండ్ హాఫ్లో వచ్చే పరిణామాలు బాగా లింక్ అయ్యాయని కొందరు పేర్కొన్నారు. చాలాకాలం తర్వాత తెలుగు సినిమా నుంచి మంచి కంటెంట్ వచ్చిందని, పెట్టిన డబ్బుకు విలువ దక్కిందని ప్రేక్షకులు చెబుతున్నారు.
అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరింత ఎలివేట్ చేయడంలో కీలకపాత్ర పోషించిందని, ఆయన సంగీతం చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందని ట్వీట్లు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ నుంచి ఇంత ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఊహించలేదని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్కు మరియు జనరల్ ఆడియెన్స్కు కూడా మంచి ట్రీట్గా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ‘ఏదో ఏదో గమ్మత్తుగా’ అనే రొమాంటిక్ సాంగ్ సినిమాకు ముందుగా ప్రచారంలోకి వచ్చినా, అది చిత్రంలో లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది.
చివరగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్టు బాగా పనిచేసిందని, ప్రతి ఫ్రేమ్లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి టాలెంట్ స్పష్టంగా కనిపించిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కొంతమంది సినిమా నెమ్మదిగా సాగిందని, కొద్దిగా బోర్ అయ్యిందని కామెంట్లు చేసినా, ఓవరాల్గా మాత్రం సినిమా మస్ట్ వాచ్ లిస్టులో ఉందని, థియేటర్లో చూసే అనుభూతి వేరేలా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ‘రగిలే’ పాట సినిమా పూర్తైన తర్వాత కూడా ప్రేక్షకుల మైండ్లో హంట్ చేస్తుందని పలువురు అంటున్నారు. మొత్తంగా విజయ్ దేవరకొండ ఏడేళ్ల తర్వాత బ్లాక్బస్టర్ హిట్ను అందుకున్నాడని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.