ఆధార్ కార్డు దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి తప్పనిసరి పత్రంగా మారింది. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం నుంచి రేషన్, స్కాలర్షిప్, పెన్షన్, ఆధార్–పాన్ లింక్ వరకు అనేక సేవల్లో ఆధార్ తప్పనిసరి అయింది. అయితే, ఆధార్ వివరాలను సవరించుకోవాల్సిన పరిస్థితులు తరచుగా వస్తుంటాయి. పేరు, చిరునామా మార్పులు, జన్మతేదీ సవరణలు, అలాగే బయోమెట్రిక్ అప్డేట్లు (వేలిముద్రలు, కనుపాప స్కాన్) అవసరం అవుతాయి. ఈ సేవలకు ఇప్పటి వరకు తక్కువ మొత్తమే వసూలు చేస్తూ వచ్చారు. కానీ దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారి యూఐడీఏఐ (UIDAI) పెద్ద ఎత్తున ఛార్జీల పెంపు చేసింది.
తాజా నిబంధనల ప్రకారం, ఆధార్ కార్డులో పేరు, చిరునామా, జన్మతేదీ వంటి డెమోగ్రాఫిక్ వివరాల సవరణకు ఇకపై రూ. 75 చెల్లించాలి. ఇది ముందుగా రూ. 50 మాత్రమే ఉండేది. అదే విధంగా, వేలిముద్రలు, కనుపాప స్కాన్ వంటి బయోమెట్రిక్ అప్డేట్ల కోసం వసూలు చేసే ఛార్జీలు కూడా రూ. 100 నుంచి రూ. 125కు పెంచారు. ఈ కొత్త ధరలు 2028 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని UIDAI స్పష్టం చేసింది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి మళ్లీ రివ్యూ చేసే అవకాశం ఉంది.
ఛార్జీల పెంపులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. చిన్నారులకు తప్పనిసరిగా చేయాల్సిన బయోమెట్రిక్ అప్డేట్లు (5 ఏళ్లు, 15 ఏళ్లు నిండినప్పుడు) యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయి. అలాగే, కొత్తగా పుట్టిన శిశువుల ఆధార్ నమోదు కూడా ఉచితం గానే ఉంటుంది. అంటే పిల్లల విషయంలో ఎలాంటి అదనపు భారమూ ఉండదు.
ఆధార్ కేంద్రాలకు వెళ్లలేని వారికి యూఐడీఏఐ అందిస్తున్న హోమ్ ఎన్రోల్మెంట్ సేవల ఛార్జీలు మాత్రం భారీగా పెరిగాయి. ఇంతకుముందు తక్కువగా వసూలు చేస్తూ ఉన్నా, ఇకపై ఇంటి వద్ద ఆధార్ సేవలు పొందాలంటే జీఎస్టీతో కలిపి రూ. 700 చెల్లించాలి. ఒకే ఇంట్లో ఒకరికి మించి ఉంటే, మొదటి వ్యక్తికి రూ. 700, ఆ తర్వాత ప్రతి అదనపు వ్యక్తికి రూ. 350 వసూలు చేస్తారు. దీంతో పౌరులకు ఆధార్ సేవల ఖర్చు గణనీయంగా పెరిగినట్టే.