కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా పెద్ద ఊరట ఇచ్చే శుభవార్త. పదవీవిరమణ తర్వాత నెలల తరబడి పెన్షన్, రిటైర్మెంట్ బకాయిల కోసం ఎదురుచూడాల్సిన బాధ ఇకపై ఉండదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త, కఠినమైన మార్గదర్శకాలను ప్రకటించింది.
ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం ఒక్కటే: పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ (PPOs) జారీ, రిటైర్మెంట్ డ్యూస్ చెల్లింపు మరియు తొలి పెన్షన్ విడుదలలో ఏ మాత్రం ఆలస్యం జరగకుండా నిరోధించడం. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే, ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు వారికి సమయానికి, కచ్చితంగా అందే అవకాశం ఉంది.
సాధారణంగా పదవీవిరమణ తర్వాత విజిలెన్స్ క్లియరెన్స్ ఆలస్యం కావడం వల్ల పించన్ ప్రక్రియ మొత్తం ఆగిపోయేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, విజిలెన్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల పింఛన్ ఆలస్యం కావడానికి అవకాశం ఉండదు.
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలు, 2021 ప్రకారం, పదవీవిరమణకు మూడు నెలల ముందు సంబంధిత శాఖలు తమ ఉద్యోగులకు విజిలెన్స్ క్లియరెన్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ బాధ్యతను ఆయా శాఖలకే అప్పగించారు.
ఈ కొత్త నిబంధన, పెన్షన్ ప్రక్రియను సులభతరం చేసి, ఉద్యోగులకు అనవసరమైన టెన్షన్ తగ్గిస్తుంది.
పింఛన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, ప్రభుత్వం 'భవిష్య' (Bhavishya) పోర్టల్లో కూడా కొన్ని సాంకేతిక మార్పులు చేసింది. ఈ పోర్టల్ పించన్ ప్రక్రియకు సంబంధించిన అన్ని దశలను ట్రాక్ చేస్తుంది.
దీని ద్వారా గడువు మించిన కేసులు ఆటోమేటిక్గా ఫ్లాగ్ అవుతాయి.
సమస్య పరిష్కారం కోసం ఆ ఫైల్ పై స్థాయి అధికారులకు ఆటోమేటిక్గా ఎస్కలేషన్ అయ్యి, సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కడా ఫైళ్లు నిలిచిపోకుండా చూసేందుకు ఈ మార్పు చాలా ఉపయోగపడుతుంది.
ఉద్యోగులకు సహాయం అందించడం కోసం ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది.
ప్రతి పదవీవిరమణ పొందే ఉద్యోగి కోసం ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ ఆఫీసర్ లేదా పెన్షన్ మిత్రను నియమించనున్నారు.
ఈ అధికారులు రిటైర్ అయ్యే ఉద్యోగులకు అవసరమైన పత్రాలు, ఫారమ్లు పూర్తి చేయడంలో వ్యక్తిగతంగా సహాయం అందిస్తారు.
దురదృష్టవశాత్తూ ఉద్యోగి మరణించిన సందర్భంలో, వారి కుటుంబ సభ్యులకు (డిపెండెంట్స్) లేదా చట్టపరమైన వారసులకు కూడా ఈ అధికారులు అవసరమైన మద్దతు అందిస్తారు. ఇది కుటుంబ సభ్యులకు పెద్ద ధైర్యాన్నిస్తుంది.
ఈ కొత్త మార్పులతో పదవీవిరమణ పొందిన ఉద్యోగికి సమయపాలన విషయంలో మూడు ముఖ్యమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి:
ఉద్యోగి రిటైర్మెంట్కు 60 రోజుల ముందుగానే పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ (PPOలు) లేదా e-PPOలు జారీ చేయాలి.
రిటైర్మెంట్ అయిన తర్వాతి రోజు వెంటనే రిటైర్మెంట్ డ్యూస్ (బకాయిలు) చెల్లింపు జరగాలి.
తొలి పెన్షన్ను పదవీవిరమణ అయిన తర్వాత వచ్చే నెల చివరి రోజున తప్పనిసరిగా చెల్లించాలి.
ఈ సంస్కరణలు సరిగ్గా అమలు అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం పర్యవేక్షణ వ్యవస్థను కూడా కఠినతరం చేసింది.
అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హై-లెవల్ ఓవర్సైట్ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది.
జిల్లావారీగా పర్యవేక్షణాధికారులు, అలాగే పెన్షన్ పంపిణీ బ్యాంకులు కూడా సమయపాలన పాటిస్తున్నాయా లేదా అనే సమాచారాన్ని కఠినంగా గమనిస్తారు.
సర్వీస్ రికార్డులను డిజిటల్ రూపంలో ఉంచడానికి e-HRMS వినియోగాన్ని పెంచుతున్నారు. దీనివల్ల పొరపాట్లు తగ్గి, పనితీరులో వేగం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఈ మొత్తం వ్యవస్థతో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన రిటైర్మెంట్ తర్వాత, ఆర్థిక భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.