కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా మద్దతు చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్లో ఫ్రస్టేషన్ పెరిగిపోయిందని, ఆయన వ్యక్తిగత విమర్శల దాకా దిగజరుతున్నారని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.
ఈరోజు ఉదయం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు, వారి వ్యాఖ్యలు, విధ్వంసకర రాజకీయాలు చూస్తుంటే ఒక రాజకీయ నేతగా తనకు చాలా బాధ కలుగుతుందన్నారు.
వ్యక్తిగత దూషణలు రాజకీయ సంప్రదాయానికి తగవు"
మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం తనకు ఉన్నదని, నాలుగైదు దశాబ్దాలుగా రాజకీయాలను దగ్గరగా గమనిస్తున్నానని చెప్పారు. కానీ వైసీపీ నేతల వ్యవహార శైలిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు.
ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాయి గానీ, వ్యక్తిగత దూషణలకు దిగడం, నాయకులను కించపరచడం తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.
వైసీపీ జగన్ తీరు బాధాకరం"
ప్రస్తుత వైసీపీ పరిస్థితులు, జగన్ మాటలు, పర్యటనలు, ప్రకటనలన్నింట్లో భయంతో కూడిన అసహనం కనిపిస్తున్నదన్నారు.
175 స్థానాల నుంచి 11కి పడిపోయిన దెబ్బతో జగన్ అనైతికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ, విధ్వంసకర పరిస్థితులకు ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించాలి"
ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక, దిగువ స్థాయి నాయకులకు ఆదర్శంగా ఉండాలి" అంటూ జగన్కి హితవు పలికారు.
తాను ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పని చేశానని – వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి – వారెప్పుడూ వైఖరి తప్పితే నేరుగా మందలించేవారని, కానీ వివాదాస్పదంగా మాట్లాడమని ఎప్పుడూ ప్రోత్సహించలేదని వివరించారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కక్షపూరిత రాజకీయాలు వద్దని, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని మంత్రులందరినీ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
ఫ్రస్టేషన్ మాటల్లోనూ కనిపిస్తోంది.
చంద్రబాబు గురించి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వింటే ఆయన ఎంత దిగజారి మాట్లాడుతున్నారో, ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. గతంలో రెండు దశాబ్దాలకు పైగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదని, అది ఓ నైతిక విలువ అని మంత్రి పార్థసారథి గుర్తుచేశారు.