అమెరికా ప్రభుత్వం వీసా విధానంలో కీలకమైన మార్పులు చేసింది. ఇప్పటి వరకు చాలా మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ మినహాయింపు ఇచ్చేవారు. కానీ సెప్టెంబర్ 2, 2025 నుండి ఎక్కువమంది నాన్-ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు తప్పనిసరిగా కౌన్సులేట్ లేదా ఎంబసీలో ప్రత్యక్షంగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఈ నిర్ణయం వల్ల గతంలో మినహాయింపు పొందిన చిన్న పిల్లలు, వృద్ధులు సహా చాలా మందికి కొత్తగా నియమాలు వర్తిస్తాయి.
ఇంతకుముందు 14 ఏళ్లు లోపు పిల్లలు, 79 ఏళ్లు పైబడినవారికి ఇంటర్వ్యూ అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం వారు కూడా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక వీసా వర్గాల్లో ఉన్న అధికారులకు మాత్రం మినహాయింపు కొనసాగుతుంది. ఉదాహరణకు, A-1, A-2, C-3 వీసా కలిగిన అధికారులు ఈ నిబంధనకు లోబడరు. కానీ వారి వ్యక్తిగత సిబ్బంది మాత్రం మినహాయింపులోకి రారు.
H-1B, F-1 స్టూడెంట్ వీసా కలిగిన వారికి ఇది మరింత ప్రభావం చూపుతుంది. గతంలో వీరి వీసా గడువు ముగిసి 12 నెలల్లోపే కొత్త వీసా కోసం అప్లై చేస్తే ఇంటర్వ్యూకు వెళ్లకుండా మినహాయింపు లభించేది. కానీ ఇప్పుడు అది రద్దు అయింది. అంటే, ఇకపై ఈ వీసాల రీన్యువల్ కోసం కూడా వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే. ఈ మార్పులు అమెరికా వీసా ప్రక్రియను కఠినతరం చేస్తున్నాయి.
కొంతమందికి మాత్రం ఇంకా ఇంటర్వ్యూ మినహాయింపు ఉంటుంది. ఉదాహరణకు, గతంలో 18 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత పూర్తి గడువు ఉన్న B1/B2 వీసా పొందినవారు, ఆ వీసా గడువు ముగిసిన ఏడాదిలోపల తిరిగి రీన్యూ చేసుకుంటే వారికి మినహాయింపు లభించవచ్చు. కానీ వీసా తిరస్కరణ ఎదుర్కొన్న వారు లేదా అర్హతపై సందేహాలు ఉన్నవారికి మాత్రం ఈ అవకాశం ఉండదు. ఈ విధంగా ప్రతి అభ్యర్థి తన అర్హతను ముందుగానే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అమెరికా వీసా ఫీజుల విషయంలో కూడా భారీ పెంపు ప్రకటించారు. ముఖ్యంగా నాన్-పిటిషన్ బేస్డ్ వీసాలపై ఇది వర్తిస్తుంది. వీటిలో విద్యార్థి వీసాలు (F-1, F-2), ట్రాన్సిట్ వీసాలు, అలాగే B1/B2 బిజినెస్, టూరిస్ట్, మెడికల్ వీసాలు ఉన్నాయి. ప్రస్తుతం $185 (₹16,217) గా ఉన్న ఫీజు 148% కంటే ఎక్కువగా పెరుగనుంది. మొత్తంగా, అమెరికా వీసా పొందాలనుకునే వారికి ఇకపై ఇంటర్వ్యూ తప్పనిసరి అవుతుండటంతో పాటు ఖర్చు కూడా గణనీయంగా పెరుగనుంది.