టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైన నేపథ్యంలో మాజీ భారత కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, యువ ఆటగాడు హార్ధిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గంగూలీ మాట్లాడుతూ “ఇలాంటి నిర్ణయాలు కేవలం ఒక్కసారిగా తీసుకోబడవు. రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాడు, బీసీసీఐ మధ్య పరస్పర చర్చలు జరిగి ఉండొచ్చు. ఇది బలవంతపు నిర్ణయం కాదని అనిపిస్తోంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే ఈ మార్పు జరిగి ఉండాలి” అన్నారు.
అతను రోహిత్ లీడర్షిప్కి పెద్దగా ప్రశంసలు కురిపించారు. “రోహిత్ ఒక అద్భుతమైన కెప్టెన్. అతని నాయకత్వంలో భారత జట్టు ఎన్నో విజయాలు సాధించింది. టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ తనదైన ముద్ర వేసాడు. అతడు జట్టును సమతౌల్యంగా నడిపించాడు. కానీ ప్రతి కెప్టెన్ కెరీర్లో ఒక దశ వస్తుంది, ఆ సమయంలో మార్పు అనివార్యం అవుతుంది” అని గంగూలీ స్పష్టం చేశారు.
క్రీడల్లో వయసు ఒక ముఖ్యమైన అంశం. రోహిత్ 2027 నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. ఆ వయసులో అంతర్జాతీయ స్థాయిలో నిరంతర ఆట తేలిక కాదు. మేమందరం కూడా ఆ దశను ఎదుర్కొన్నాం నేను, ద్రావిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, ఇంతకుముందు గిల్క్రిస్ట్ కూడా. వయసు పెరిగేకొద్దీ శరీరం స్పందించే విధానం మారుతుంది. అలాంటప్పుడు కొత్త తరం ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం సహజం” అని వివరించారు.
గంగూలీ అభిప్రాయం ప్రకారం, కెప్టెన్సీ మార్పు రోహిత్ శర్మ ప్రతిభను తగ్గించదు. “రోహిత్ ఇప్పటికీ టీమిండియా కోసం విలువైన ఆటగాడు. అతని అనుభవం, బ్యాటింగ్ స్టైల్, ప్రెషర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఇవన్నీ యువ ఆటగాళ్లకు ప్రేరణ. కెప్టెన్సీ పోయిందన్న కారణంగా అతని విలువ తగ్గిపోదు. సీనియర్ ఆటగాడిగా జట్టుకు మార్గదర్శకుడిగా కొనసాగుతాడు అని గంగూలీ చెప్పారు.
తాజాగా రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించబడిన తర్వాత, అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఈ నిర్ణయాన్ని విమర్శిస్తుండగా, మరికొందరు కొత్త నాయకత్వానికి స్వాగతం పలుకుతున్నారు. రోహిత్ను ఐసీసీ ఈవెంట్స్లో గెలుపు దూరమయ్యిందని విమర్శించే స్వరాలు వినిపిస్తుండగా, గంగూలీ మాత్రం దీనిపై సమతౌల్యమైన దృక్కోణం చూపించారు.
ఒక కెప్టెన్ విజయాలు సాధించకపోతేనే మార్పు అని కాదు. టీమ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూడా మార్పులు చేస్తారు. హార్ధిక్ పాండ్యా యవ్వనంతో, ఉత్సాహంతో ఉన్న నాయకుడు. అతడికి భవిష్యత్తులో బలమైన జట్టు నిర్మించే అవకాశం ఉంది. అయితే రోహిత్ లాంటి సీనియర్ ఆటగాడు జట్టులో ఉండటం యువతకు మానసిక బలం ఇస్తుంది అని గంగూలీ తెలిపారు.
గంగూలీ వ్యాఖ్యలు రోహిత్ అభిమానులకు కొంత ఊరటనిచ్చాయి. ఆయన మాటల ద్వారా రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పించబడటం అంతర్గత ఒప్పందం ద్వారానే జరిగిందన్న సంకేతం కనిపిస్తోంది. ఇక రోహిత్ శర్మ భవిష్యత్తుపై క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అతడు టెస్ట్ కెప్టెన్గా కొనసాగుతాడా? లేక పూర్తి స్థాయిలో యువతకే బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది సమాధానం కోసం వేచిచూడాల్సి ఉంది. అయితే గంగూలీ చెప్పినట్టే“కెప్టెన్సీ మార్పు ఆటలో భాగం మాత్రమే. కానీ గొప్ప ఆటగాడు తన ఆటతో ఎప్పుడూ జట్టుకు విలువ చేకూర్చగలడు.”