ఓ కేసులో పోలీసులు స్టేషన్ కు పిలిచి వేధించారంటూ గడ్డి మందు తాగిన మహిళ..
గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి..
గుంటూరు జిల్లా తెనాలిలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసి గడ్డిమందు తాగిన తిరుపతమ్మ అనే మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూసింది.
సమాచారం ప్రకారం, తిరుపతమ్మ తన భర్తతో కలిసి తెనాలి కొత్తపేటలోని ఓ అపార్టుమెంట్లో పని చేసేది. అదే అపార్టుమెంట్లో నివసించే ఓ మహిళ తన బంగారం పోయిందని, తిరుపతమ్మకు ఇచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తిరుపతమ్మ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.
ఈ కేసు విచారణలో భాగంగా తెనాలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు పిలిపించిన పోలీసులు తనను తీవ్రంగా వేధించారని తిరుపతమ్మ ఆరోపించింది. ఈ విషయాన్ని ఆమె సెల్ఫీ వీడియోలో కూడా వెల్లడించింది. “నేను చేయని నేరానికి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. బంగారం విషయం మీద పదేపదే ప్రశ్నిస్తూ మానసికంగా వేధిస్తున్నారు” అంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మనస్తాపానికి గురైన తిరుపతమ్మ నిన్న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తెల్లవారుజామున మృతి చెందింది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళ మృతికి కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. తిరుపతమ్మ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల వేధింపుల కారణంగానే ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు.