ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2025 వేదికగా రిలయన్స్ జియో మరోసారి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. భద్రతను ప్రధానంగా తీసుకుని “సేఫ్టీ ఫస్ట్” కాన్సెప్ట్తో కొత్త “జియోభారత్” ఫోన్ సిరీస్ను ఆవిష్కరించింది. ఈ ఫోన్లు ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. కేవలం రూ.799 ప్రారంభ ధరతో అందుబాటులోకి వస్తున్న ఈ ఫోన్లు భద్రతతో పాటు సరసమైన ధరతో కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో జియో కంపెనీ విద్యార్థుల కోసం ఉచిత “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)” కోర్సును కూడా ప్రకటించడం మరో విశేషం.
జియోభారత్ ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్, యూజేజ్ మేనేజ్మెంట్ వంటి ఆధునిక ఫీచర్లను జియో పొందుపరిచింది. లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా ఫోన్ వాడుతున్న వారి ప్రస్తుత స్థానాన్ని నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవచ్చు. అదే విధంగా యూజేజ్ మేనేజర్ టూల్ ద్వారా పిల్లలు లేదా వృద్ధులు ఎవరితో మాట్లాడాలి, ఎవరి నుంచి కాల్లు రావాలి అనే అంశాలపై పూర్తి నియంత్రణ ఉంటుంది. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్లను ఆటోమేటిక్గా బ్లాక్ చేయగల సౌకర్యం కూడా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 7 రోజుల పాటు బ్యాటరీ నడవడం ఈ ఫోన్ల మరో ప్రత్యేకత.
ఈ ఫోన్లు జియో స్టోర్లు, జియోమార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారమ్లతో పాటు ఆఫ్లైన్ రిటైల్ దుకాణాల్లో కూడా లభ్యం కానున్నాయి. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలు లేదా వృద్ధుల భద్రత కోసం, అనవసరమైన కాల్స్ లేదా సోషల్ మీడియా ప్రభావం నుంచి దూరంగా ఉంచడానికి ఈ ఫోన్లు ఎంతగానో సహాయపడతాయని జియో తెలిపింది. భద్రత, సరసమైన ధర, మరియు దీర్ఘకాల బ్యాటరీ వంటి ఫీచర్లతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఫోన్లకు మంచి స్పందన లభించే అవకాశం ఉంది.
ఇదే కార్యక్రమంలో జియో మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన పెంచే లక్ష్యంతో “జియో ఏఐ క్లాస్రూమ్” పేరిట ఉచిత ఫౌండేషన్ కోర్సును ప్రారంభిస్తోంది. జియో ఇన్స్టిట్యూట్తో కలిసి రూపొందించిన ఈ నాలుగు వారాల కోర్సులో ఏఐ ప్రాథమిక అంశాలు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వంటి కీలక అంశాలను బోధిస్తారు. కోర్సును జియోపీసీ, ల్యాప్టాప్, స్మార్ట్ టీవీ, జియో సెట్టాప్ బాక్స్ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు. కోర్సు పూర్తి చేసిన వారికి డిజిటల్ బ్యాడ్జ్తో పాటు, జియో ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ కూడా అందించబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా భారత యువతకు టెక్నాలజీ రంగంలో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని కంపెనీ పేర్కొంది.