ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాలనావ్యవహారాల్లో కృత్రిమ మేధస్సు వినియోగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలోనూ దీనిపై ఫోకస్ పెట్టింది. దోమల నియంత్రణకు కూడా దీనిని వినియోగించాలని ఆలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృత్రిమ మేధస్సును ఉపయోగించాలని ఆలోచనలు చేస్తోంది. చదువులో వెనుకబడిన పిల్లలకు డిజిటల్ విధానంలో బోధించే విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. వ్యక్తిగత అనుకూల విద్యాబోధన విధానంలో భాగంగా డిజిటల్ విద్యాబోధన ద్వారా విద్యార్థులు ఇష్టపడే విధానంలోనే పాఠాలు అర్థమయ్యేలా చెప్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇంగ్లిష్, గణితం, తెలుగు సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు డిజిటల్ విధానంలో చదువు చెప్పనున్నారు. ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో ఈ విధానం అమలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని ఎనిమిది పాఠశాలలను ఇందుకోసం ఎంపిక చేశారు. గతేడాది రెడ్డిగూడెం, గంపలగూడెం, ఎ.కొండూరు బాలికల గురుకుల పాఠశాలల్లో ఈ విధానం అమలు చేశారు. వ్యక్తిగత అనుకూల విద్యాబోధన విధానంలో భాగంగా ఎంపిక చేసిన ఒక్కొక్క పాఠశాలకు ట్యాబ్లను అందజేశారు. అలాగే విద్యుత్ చార్జింగ్ ప్రయోగశాల ఏర్పాటు కోసం స్కూళ్లకు రూ.22,500 చొప్పున నిధులు కేటాయించారు.
మరోవైపు విద్యార్థుల సబ్జెక్టులలోని పాఠ్యాంశాలను తొలుత ఈ ట్యాబ్లలో నిక్షిప్తం చేస్తారు. డేటా విశ్లేషణ, కృత్రిమ మేధస్సు ద్వారా ఈ ట్యాబ్లు పనిచేస్తాయి. స్కూళ్లల్లోని విద్యుత్ చార్జింగ్ ప్రయోగశాలలోకి వెళ్లి ట్యాబ్ ఓపెన్ చేయగానే వీడియోలో పాఠం వస్తుంది. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు వస్తాయి. పాఠం విని, ఆ తర్వాత వచ్చే ప్రశ్నలలో ఎన్నింటికి సరైన సమాధానాలు చెప్తారో తెలుసుకుని.. కృత్రిమ మేధస్సు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. అలాగే తప్పులను కూడా తెలియజేస్తుంది.
విద్యార్థులు చెప్పే జవాబుల ఆధారంగా తర్వాతి పాఠాలు వస్తాయని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా విద్యార్థులకు ఇష్టమైన పద్ధతిలోనే పాఠాలు బోధించి మెరుగైన ఫలితాలు సాధించాలనేది ప్రభుత్వం ఆలోచన. పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని పాఠశాలల్లో ప్రారంభించి.. వచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు.