ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి శాశ్వత భవనం పనులు ముగింపు దశకు వచ్చాయి. తొలి భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. అమరావతిలో రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆగష్టు 15 నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయం శాశ్వత భవనం ఆగష్టు 15న ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఈ శాశ్వత భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ మేరకు తొలి శాశ్వత భవనం ప్రారంభోత్సవానికి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే రాజధాని నగర పాలన మరింత సులువు అవుతుందని భావిస్తున్నారు.
ఈ శాశ్వత భవనం పనులు అనుకున్న సమయానికి పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు మున్సిపల్శాఖ మంత్రి నారాయణ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతేడాది అక్టోబరు 19న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణ పనులను ఇక్కడి నుంచే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పుడు చంద్రబాబు చేతుల మీదుగా ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇప్పుడు ఆ పనులు ముగింపు దశకు వచ్చాయంటున్నారు. ఆగస్టు 15కు ప్రారంభించాలని భావిస్తుండటంతో ఆ పనుల్ని మరింత వేగవంతం చేశారు అధికారులు. ఈ శాశ్వత కార్యాలయం కోసం ఈ భవనాన్ని దాదాపు 3.62 ఎకరాల్లో ఏడు అంతస్తులతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యాలయం మొత్తం నిర్మాణ విస్తీర్ణం 2.42 లక్షల చదరపు అడుగులు.
ఈ భవనం గ్రౌండ్ అంతస్తులో సమ్మిళిత కమాండ్ కంట్రోల్ గదిని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా అమరావతి నగరంలోని ట్రాఫిక్, భద్రత, పారిశుద్ధ్యం, వరదలు వంటి వాటిని సమీక్ష చేయొచ్చు. ఈ శాశ్వత కార్యాలయ భవనం అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం విజయవాడలో ఉన్న కార్యాలయాన్ని మున్సిపాలిటీలలో పేదరూపంలో నివసించే ప్రజల కోసం ఉన్న మిషన్కు అప్పగించాలని నిర్ణయించారు.