ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు దసరా పండుగ కానుకను అందించింది. ఉద్యోగులపై ఉన్న డీఏ బకాయిల చెల్లింపులో భాగంగా తొలి విడత మొత్తాలను విడుదల చేసింది. సోమవారం నాటికి ఒక్కో ఉద్యోగి ఖాతాలో రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు జమ చేశారు. మొత్తం ఆరు విడతల్లో డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, ఒక్కో ఉద్యోగికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు డీఏ బకాయిలు లభించనున్నాయి. ఇప్పటికే మొదటి విడత మొత్తాలు చేరడంతో మిగతా విడతలు త్వరలోనే చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఊరట కలిగించిందని, పండగ సీజన్లో ఇది నిజమైన కానుక అని ఉద్యోగులు భావిస్తున్నారు.
అయితే మరోవైపు, సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలు సీపీఎస్ను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ ఏపీ ప్రభుత్వం కూడా అదే దిశగా ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, అప్పటి వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.