భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలిచే రంగం వ్యవసాయం కాగా, అన్నదాతలే కోట్లాది ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు. రైతుల అభ్యున్నతికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా, వాటిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలామంది రైతులు పూర్తి స్థాయిలో లబ్ధి పొందలేకపోతున్నారు. వ్యవసాయం తరువాత రైతులు ఎక్కువగా ఆధారపడేది పాడిపరిశ్రమ, గొర్రెల పెంపకం, చేపలు, రొయ్యల సాగు వంటి వ్యవసాయ అనుబంధ రంగాలపైనే. ఈ నేపథ్యంలో పాడి రైతులకు తోడుగా ఉండేందుకు కేంద్రం, రాష్ట్రం కలిసి ‘పశు కిసాన్ క్రెడిట్ కార్డు’ పథకాన్ని ప్రారంభించాయి.
ఈ పథకం ద్వారా పాడిరైతులకు రూ.2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రుణాలు మంజూరు అవుతున్నాయి. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, చేపలు, రొయ్యలు పెంచే రైతులు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం పొందే రైతు కేవలం 15% డబ్బులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది, మిగతా మొత్తాన్ని బ్యాంకులు పూచీకత్తు లేకుండా రుణాల రూపంలో ఇస్తాయి. అయితే ఈ రుణం మొత్తాన్ని రైతులు నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించాలి. తమ పశువులకు ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా రైతులే భరించాలి. జిల్లా కలెక్టర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్లు సకాలంలో రుణాలు రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదే సమయంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’, కేంద్రం పీఎం కిసాన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ బీమా యోజన వంటి పథకాలను కొనసాగిస్తోంది. ఈ పథకాల ఉద్దేశం వ్యవసాయ రంగాన్ని కష్టకాలంలో ఆదుకోవడమే. ముఖ్యంగా పూచీకత్తు లేకుండా ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పాడిరైతులకు సూచిస్తున్నారు.