రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్ని ప్రపంచ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, గ్లోబల్ మార్కెట్లో ఏపీ స్థానాన్ని బలపరుస్తామని వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
నిన్న వెలగపూడి సచివాలయంలో జరిగిన రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షత వహించారు. మత్స్య సంపద, ఉత్పత్తి నాణ్యత, ఎగుమతి అవకాశాలు, రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాలపై అధికారులు సమగ్రంగా చర్చించారు.
మంత్రి మాట్లాడుతూ, మత్స్యశాఖలో ఆధునిక సాంకేతికత, పర్యావరణ అనుకూల పద్ధతులు, శాస్త్రీయ విధానాల వినియోగం ద్వారా ఉత్పత్తి పెంపు సాధించి, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ప్రతిష్టను పెంపొందిస్తామని హామీ ఇచ్చారు.
లైసెన్స్ ప్రక్రియ సులభతరం. రైతులు తమ ఆక్వా చెరువులను రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ చట్టం కింద ఇకపై ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీతో లైసెన్స్ పొందే సమయం తగ్గి, ప్రభుత్వ పథకాల లాభాలు సులభంగా అందుతాయని చెప్పారు. సముద్ర ఆహార నాణ్యత, ట్రేసబిలిటీ పెంపులో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
డీ-పట్టా, అసైన్, సీజేఎఫ్ఎస్ భూములపై చేపల పెంపకం చేస్తున్న వారికి సాగు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తామని తెలిపారు. దీతో వారు ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందగలరని చెప్పారు.
పౌల్ట్రీ వ్యర్థాలకు కఠిన నో. కొన్ని ప్రాంతాల్లో చేపల ఆహారంగా పౌల్ట్రీ వ్యర్థాలను వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇది ప్రజారోగ్యానికి హానికరమని, నీటి కాలుష్యానికి కారణమని పేర్కొన్నారు. వెంటనే ఈ విధానాన్ని నిలిపివేయాలని రైతులను హెచ్చరించారు. ఇలాంటివి కొనసాగితే లైసెన్స్ రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
అమెరికా సుంకాల ప్రభావం తగ్గించేందుకు చర్యలు 2025 ఆగస్టు 27 నుండి అమెరికా భారతీయ రొయ్యలపై విధించే 50% టారిఫ్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. MPEDA సహకారంతో దక్షిణ కొరియా, యూరప్, యూకే, మిడిల్ ఈస్ట్, రష్యా, ఆఫ్రికా వంటి కొత్త మార్కెట్లను అన్వేషించాలని సూచించారు.
యూకేతో కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) అవకాశాలను ఉపయోగించుకోవాలని, విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని ఎగుమతిదారులకు సూచించారు. అధిక సుంకాల సమస్యపై సీఎం చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో APSADA కో-వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, మత్స్య శాఖ కమిషనర్ రామ శంకర్ నాయిక్, ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.