తూర్పు కరేబియన్ దీవుల్లో ఆస్తి కొనుగోలు చేసేవారికి అక్కడి ప్రభుత్వాలు ఓ అదిరిపోయే ఆఫర్ ప్రకటించాయి. ఆంటిగ్వా & బార్బుడా, డొమినికా, గ్రెనడా, సెయింట్ కిట్స్ & నెవిస్, సెయింట్ లూసియా దేశాల్లో రూ.1.75 కోట్లకు ఇంటి పెట్టుబడి పెడితే పౌరసత్వంతో పాటు ఆ దేశ పాస్పోర్ట్ కూడా లభిస్తుంది.
ఈ పాస్పోర్ట్తో వీసా అవసరం లేకుండా యూకే సహా 150 దేశాలకు ప్రయాణించొచ్చు. పైగా, ఆ దీవుల్లో మూలధన లాభాలపై, వారసత్వ సంపదపై పన్నులు ఉండవు. కొన్నింటిలో ఆదాయంపై కూడా పన్ను లేదు. అందుకే సంపన్నులు, వ్యాపారవేత్తలు ఈ దేశాలపై ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక్కడ పౌరసత్వం పొందాలంటే ఇప్పటికే ఉన్న పౌరసత్వాన్ని వదలాల్సిన అవసరం లేదు. ఆంటిగ్వాలో డిమాండ్ ఎక్కువగా ఉందని, కొనుగోలుదారుల్లో 70% మంది పౌరసత్వం కోసమే ఇంట్లు కొనుగోలు చేస్తున్నారని అక్కడి ప్రాపర్టీ డీలర్ నడియా డైసన్ చెప్పారు.
“ఇక ఇప్పుడు, పౌరసత్వంతో పాటు ఇంటి కోసం డిమాండ్ బాగా పెరిగింది. అంతకు ముందు ఫోకస్ లగ్జరీ లైఫ్స్టైల్ మీదే ఉండేది. కానీ ఇప్పుడు అందరూ 'నాకు పాస్పోర్ట్ కూడా కావాలి' అంటున్నారు,” అని ఆమె వివరించారు.
హెన్లీ అండ్ పార్టనర్స్ అనే సంస్థ ప్రకారం, అమెరికా పౌరులు, యుక్రెయిన్, తుర్కియే, చైనా, నైజీరియా వంటి దేశాలవారు కూడా పెద్దఎత్తున సీబీఐ (సిటిజెన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్) కోసం దరఖాస్తులు చేస్తున్నారు. 2024 చివరి త్రైమాసికంలో దరఖాస్తులు 12% పెరిగాయని సంస్థ తెలిపింది.
అమెరికాలో రాజకీయ అస్థిరత, సామాజిక ఉద్రిక్తతలు, టెక్సెస్ మొదలైన ప్రదేశాల్లో తుపాకీ హింస వంటి అంశాలు కూడా అమెరికన్లు ఇతర పౌరసత్వాల వైపు చూడడానికి ప్రధాన కారణాలుగా మారాయి. "ఇది కొంతమందికి ఇన్సూరెన్స్లా. పరిస్థితులు కుదరకపోతే వెళ్లేందుకు మరో దేశం రెడీగా ఉంచుకోవాలన్న భావన" అని సంస్థకు చెందిన డొమినిక్ వోలెక్ చెప్పారు.
ఇక వాస్తవానికి, ఈ విధానాలపై కొన్ని దేశాల్లో విమర్శలూ ఉన్నాయి. పౌరసత్వాన్ని అమ్ముకుంటున్నట్టు అనిపిస్తోందని, నేరస్థులకు ఇది ఓ మార్గంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై యూరోపియన్ యూనియన్ కూడా సీరియస్గా స్పందించింది.
దీంతో కరేబియన్ దేశాలు ఇప్పుడు తనిఖీలను కఠినతరం చేస్తున్నాయి. బ్యాగ్రౌండ్ చెక్, ఇంటర్వ్యూలు తప్పనిసరి చేశారు. అయినా, ఆ దేశాల నాయకులు మాత్రం ఈ విధానాన్ని సమర్థిస్తున్నారు. ఇది జీడీపీకి 10–30% వృద్ధిని తీసుకువస్తోందని, ప్రభుత్వానికి అవసరమైన నిధులు లభిస్తున్నాయని చెబుతున్నారు.