అమెరికా ప్రభుత్వం ఆమోదించాల్సిన ఖర్చుల బిల్లులు సెనేట్లో ఆమోదం పొందకపోవడంతో మళ్లీ షట్డౌన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా అనేక ప్రభుత్వ శాఖలు కార్యకలాపాలను నిలిపివేయాల్సి వస్తోంది. ఇది కొత్త విషయం కాదు, గతంలోనూ అమెరికాలో పలుమార్లు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ట్రంప్ హయాంలో మళ్లీ ఇదే సంక్షోభం తలెత్తడంతో వీసాలు, ఇమ్మిగ్రేషన్, విదేశీ విద్యార్థులపై ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్నలు ముందుకొచ్చాయి.
మొదటిగా ఇమ్మిగ్రేషన్ సేవల విషయంలో మిశ్రమ ప్రభావం ఉంటుంది. ఫీజుల ద్వారా నిధులు సమకూర్చుకునే ఏజెన్సీలు మాత్రం కొనసాగుతాయి. ఉదాహరణకు USCIS, స్టేట్ డిపార్ట్మెంట్ కాన్సులేట్లు ప్రస్తుతానికి తెరిచి ఉంటాయి. అయితే వార్షిక బడ్జెట్పై ఆధారపడి నడిచే ఇతర విభాగాలు మూతపడతాయి. వీసా దరఖాస్తుదారులు ప్రాసెసింగ్ ఫీజులతో పాటు 250 డాలర్ల వీసా ఇంటిగ్రిటీ ఫీజు, అలాగే 24 డాలర్ల I-94 ఫీజు వంటి అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
హెచ్1బీ వీసాల విషయంలో షట్డౌన్ పెద్ద ఇబ్బందిగా మారింది. ఎందుకంటే H-1Bకు అవసరమైన లేబర్ కండిషన్ అప్లికేషన్లు (LCA) కార్మిక శాఖ ద్వారా ధృవీకరించబడాలి. కానీ ప్రస్తుతానికి ఆ శాఖ మూతపడడంతో, కొత్త హెచ్1బీ పిటిషన్లు లేదా పొడిగింపులు దాఖలు చేయడం అసాధ్యం. ఎల్సీఏ లేకుండా కొత్త వీసాలు పొందడం జరగదు. కాబట్టి గడువు ముగుస్తున్న వీసాలతో ఉన్నవారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. గ్రీన్ కార్డ్ కోసం లేబర్ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా నిలిచిపోయింది.
హెచ్1బీ లాటరీలో ఇప్పటికే ఎంపికైనవారికి మాత్రం పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే లాటరీ దాఖలుదారులకు గడువు జూన్ 30 వరకు మాత్రమే. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను USCIS ప్రాసెస్ చేస్తూనే ఉంది. కాబట్టి లాటరీలో ఎంపికైనవారికి భయం అవసరం లేదు. కానీ కొత్త దరఖాస్తులు, పొడిగింపులు, బదిలీలు, సవరణల విషయంలో మాత్రం ఈ పరిస్థితి తీవ్ర సమస్యలు తెచ్చింది.
విదేశీ విద్యార్థుల విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. వారి ఇమ్మిగ్రేషన్ స్టేటస్ SEVIS సిస్టమ్లో ఇప్పటికే నమోదై ఉంటుంది. కాబట్టి వారికి పెద్ద ఇబ్బందులు ఉండవు. విశ్వవిద్యాలయాలు సాధారణంగానే నడుస్తాయి, తరగతులు కూడా జరుగుతాయి. అయితే కొన్ని పరిశోధన ప్రాజెక్టులు లేదా ప్రభుత్వ నిధులతో నడిచే కార్యక్రమాలు మాత్రమే తాత్కాలికంగా ఆగిపోవచ్చు.
మొత్తం మీద, అమెరికా షట్డౌన్ వీసా అభ్యర్థులకు, ముఖ్యంగా హెచ్1బీ దరఖాస్తుదారులకు పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పటికే పనిచేస్తున్నవారు, గడువు ముగిసే పరిస్థితుల్లో ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఇక విద్యార్థులకు మాత్రం ప్రభావం తక్కువగానే ఉంటుంది.
ఈ పరిస్థితి ఎప్పటికి ముగుస్తుందో స్పష్టత లేదు. సెనేట్, ప్రభుత్వం త్వరగా చర్చలు జరిపి పరిష్కారం కనుక్కుంటేనే వీసా దరఖాస్తుదారులకు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. లేనిపక్షంలో, కొత్త ఉద్యోగాలు, చదువు, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అన్నీ ఆగిపోవడంతో వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.