గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో విజయవంతంగా అధికారంలోకి వచ్చింది. ఈ గెలుపు సాధించడంలో ఎన్నారైలు పెద్దపాటి పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నారైలు అందించిన మద్దతుకు కృతజ్ఞతగా, సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి వారం ఎన్నారైలతో కలిసి వారి సేవలను గుర్తిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.
ఈ వారంలో, కువైట్, అమెరికా, ఒమాన్ దేశాల నుండి వచ్చిన ఎన్నారైలు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం గారు వారి వద్దకు వచ్చిన ప్రతిఒక్కరిని ఆత్మీయంగా పలకరించి, వారి కుటుంబాలు, వృత్తి, అక్కడి పరిస్థితుల గురించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కువైట్ నుండి వచ్చిన సుధాకర్ రావు, రెహమతుల్లా, ఒమాన్ నుండి శ్రీనివాసరావు, అమెరికా నుండి భరత్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. వారితో సరదాగా మాట్లాడుతూ సీఎం గారు వారి భావజాలాన్ని వినే ప్రయత్నం చేశారు.
ఒమాన్లో జరుగుతున్న ప్రవాసాంధ్రుల సేవా కార్యక్రమాల గురించి శ్రీనివాసరావు వివరించారు. ఎన్నారై టీడీపీ ఒమాన్ టీం చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ, అందరికి తన ఆశీస్సులు తెలిపారు.
కువైట్ నుండి వచ్చిన సుధాకర్ రావు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కువైట్ సహా ఇతర గల్ఫ్ దేశాలకు డైరెక్ట్ విమానాలు నడపాలని విన్నవించారు. దానికి సీఎం గారు సానుకూలంగా స్పందించి అతి త్వరలో గల్ఫ్ దేశాలకు ఆంధ్ర నుండి డైరెక్ట్ విమానాలు మొదలుపెడతామని హామీ ఇచ్చారు.
అమెరికా నుండి వచ్చిన భారత్ కుమార్ ఇద్దరు కుమార్తెలు సాధించిన ఘనత గురించి సీఎం చంద్రబాబు కు తెలిపారు. పెద్ద కుమార్తె 18 ఏళ్లకే పైలట్ అయ్యిందని, యంగెస్ట్ పైలట్ గా ఘనత సాధించిందని, రెండో కుమార్తె పిల్లల్లో అధిక ఒత్తిడి వల్ల వచ్చే మెంటల్ ఇల్నెస్ మరియు దానికి తీసుకోవలసిన తగిన జాగ్రత్తల గురించి ఒక పుస్తకం రాసిందని ఆయన వెల్లడించారు. అమెరికా లో గూగుల్ కంపెనీ కొలాబరేషన్ తో ఈ పుస్తకం అధిక సంఖ్యలో అమ్ముడుపోతుందని, మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్న పిల్లలకు ఈ పుస్తకం సహాయ పడుతుందని తెలిపారు. వారి పిల్లలు మరిన్ని గమ్యస్థానాలను చేరుకోవాలంటూ సీఎం గారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు గారి వినమ్రత, ఆత్మీయత, శాంత స్వభావం ఎన్నారైలను ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రితో ముఖాముఖి మాట్లాడిన అనుభవాన్ని వారు తమ జీవితంలోని ఒక గుర్తుండిపోయే ప్రత్యేక సందర్భంగా గుర్తుంటుంది అని కొనియాడారు.