దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. వరుస ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు పడిపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం, వడ్డీ రేట్లపై అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి కారణాలతో మార్కెట్లలో నెగటివ్ వాతావరణం నెలకొంది. అయితే ఈ పరిస్థితుల్లోనూ కొన్ని స్టాక్స్ మాత్రం మార్కెట్ ధోరణికి భిన్నంగా దూసుకెళ్తూ పెట్టుబడిదారులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ప్రధానంగా తాజాగా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం మీషో లిమిటెడ్ నిలుస్తోంది.
ఇటీవలే ఐపీఓ ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టిన మీషో షేర్లు వరుస సెషన్లలో లాభాల బాట పట్టాయి. గురువారం రోజున ఈ షేర్ మరోసారి దూసుకెళ్లి రూ.233 వద్ద ఆల్టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. కేవలం 7 ట్రేడింగ్ సెషన్లలోనే షేర్ ధర రెట్టింపు కావడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 18న ఒక్క రోజే దాదాపు 8 శాతం లాభంతో ఈ రికార్డు స్థాయిని చేరుకోవడం విశేషం. ఇష్యూ ధర రూ.111తో పోలిస్తే ఇప్పటివరకు దాదాపు 110 శాతం లాభం ఇచ్చింది. ఈ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లను దాటింది.
ఈ షేర్పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ (UBS) కొనుగోలు రేటింగ్ ఇవ్వడం పెట్టుబడిదారులకు మరింత బలాన్ని ఇచ్చింది. యూబీఎస్ రూ.220 లక్ష్య ధరను సూచించగా, మీషో షేర్ ఇప్పటికే ఆ స్థాయిని దాటేసింది. కంపెనీ యొక్క ఆసెట్ లైట్ మోడల్, నెగటివ్ వర్కింగ్ క్యాపిటల్ నిర్మాణం వల్ల స్థిరమైన పాజిటివ్ క్యాష్ ఫ్లో వస్తోందని యూబీఎస్ విశ్లేషించింది. ఇది ఇతర ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలతో పోలిస్తే మీషోను ప్రత్యేకంగా నిలబెడుతోందని పేర్కొంది. మెరుగైన లాజిస్టిక్స్ సామర్థ్యాలు, విస్తృత కస్టమర్ బేస్ కంపెనీకి ప్రధాన బలం అని తెలిపింది.
భవిష్యత్తు దృష్ట్యా కూడా మీషోపై బ్రోకరేజ్ అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. FY25 నుంచి FY30 మధ్య కంపెనీ నెట్ మెర్చండైజ్ వ్యాల్యూ (NMV) ఏటా సుమారు 30 శాతం చొప్పున పెరుగుతుందని యూబీఎస్ అంచనా వేసింది. సహకార మార్జిన్లు 6.8 శాతానికి, FY30 నాటికి సర్దుబాటు చేసిన EBITDA మార్జిన్లు 3.2 శాతానికి చేరవచ్చని తెలిపింది. వార్షిక క్రియాశీల కస్టమర్లు ప్రస్తుతం ఉన్న 199 మిలియన్ల నుంచి 518 మిలియన్లకు పెరగడం, ఒక్కో కస్టమర్ ఆర్డర్ల సగటు సంఖ్య 9.2 నుంచి 14.7కి పెరగడం వృద్ధికి దోహదం చేస్తుందని అంచనా. అయితే మెరుగైన లాజిస్టిక్స్ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయడంతో సగటు ఆర్డర్ విలువ కొంత తగ్గే అవకాశం ఉందని కూడా పేర్కొంది.