ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కీలక ప్రతిపాదన ముందుకు వచ్చింది. గొల్లపూడిలో కొత్త శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి కోరారు. ఈ మేరకు వారు అధికారికంగా వినతిపత్రం సమర్పించారు.
గొల్లపూడిలో శాటిలైట్ లేదా హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటైతే విజయవాడ రైల్వే స్టేషన్పై ఉన్న ప్రయాణికుల భారం గణనీయంగా తగ్గుతుందని ఎంపీలు వివరించారు. అలాగే అమరావతి రాజధానికి రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ ప్రాంతం నగరానికి కేంద్రంగా ఉండటంతో పాటు రోడ్డు, రైలు, వాయుమార్గాలతో అనుసంధానానికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.
గొల్లపూడి పరిసరాల్లో రైల్వే అవసరాలకు అనువైన ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సులభంగా సేకరించవచ్చని ఎంపీలు రైల్వే మంత్రికి వివరించారు. భవిష్యత్తులో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి పూర్తయితే ఈ శాటిలైట్ స్టేషన్ మరింత ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. దీంతో ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
కొండపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో నీటి నిల్వ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కొండపల్లి నుంచి విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్పై వర్షపు నీరు, మురుగునీరు నిలిచిపోవడం వల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. చిన్నపాటి వర్షానికే నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా డ్రైనేజీ కాలువలు, కల్వర్టులు, క్రాస్ డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టాలని, తక్షణమే నిధులు కేటాయించాలని ఎంపీలు కోరారు. ఈ చర్యలు అమలైతే రైళ్ల రాకపోకలు మరింత సురక్షితంగా మారడంతో పాటు, స్థానిక ప్రజలు, పరిశ్రమలకు కలుగుతున్న ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.