తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మంచి దూకుడుతో ముందుకు సాగుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ కొరియోగ్రఫీ చేస్తూ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నారు. గతేడాది లైంగిక వేధింపుల కేసుతో వివాదంలో చిక్కుకున్న జానీ మాస్టర్, కొంత విరామం తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటతో జానీ మాస్టర్ మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ సాంగ్తో ఆయన కొరియోగ్రఫీకి మంచి స్పందన రావడంతో, తన కెరీర్ను తిరిగి బలంగా నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ఎన్నికల్లో జానీ మాస్టర్ తన సతీమణి సుమలత అలియాస్ అయేషాను పోటీకి నిలబెట్టారు. మొత్తం 510 ఓట్లకు గాను 439 ఓట్లు పోలవ్వగా, సుమలతకు 228 ఓట్లు వచ్చాయి. ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్కు 199 ఓట్లు, మరో అభ్యర్థి చంద్రశేఖర్కు 11 ఓట్లు లభించాయి. దాదాపు 29 ఓట్ల తేడాతో సుమలత విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో సీనియర్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పొల్లకి విజయ్, జోజో శ్యామ్, చంద్రకిరణ్ తదితరులు జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్కు మద్దతు ఇవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్కు మద్దతు ఇవ్వలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో సుమలత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జానీ మాస్టర్ స్పందిస్తూ, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ తదితరులపై స్పష్టత ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి గ్రూపులు లేవని, అందరూ తనకు ఇష్టమేనని చెప్పారు. షూటింగ్స్ కారణంగానే వారు హాజరుకాలేకపోయారని తెలిపారు. ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి చేరుకోవడంలో ఒక్కరి కృషి కాదు, అందరి శ్రమ ఉందని పేర్కొన్నారు. చివరగా తన భార్య గెలుపును తన గెలుపుగా భావిస్తూ, డ్యాన్సర్స్ యూనియన్ ఫౌండర్స్కు, డ్యాన్సర్స్కు, తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ భావోద్వేగంగా కృతజ్ఞతలు తెలిపారు.