Drugs: 2047 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యం.. మాదకద్రవ్యాలపై జీరో టాలరెన్స్.. కఠిన చర్యలకు కేంద్రం ఆదేశాలు!
Drugs: 2047 నాటికి భారతదేశాన్ని మాదకద్రవ్య రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి.. సాంకేతికతతో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచన..
డ్రగ్స్ రహిత దేశ నిర్మాణానికి కొత్త కార్యాచరణ.. రాష్ట్రాలకు అమిత్ షా సూచనలు..
అమరావతి: 2047 నాటికి భారతదేశాన్ని మాదకద్రవ్య రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
నార్కో కోఆర్డినేషన్కు సంబంధించి శుక్రవారం ఢిల్లీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన లక్ష్యానికి అనుగుణంగా 2047 నాటికి డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం కోసం కృషి చేయాలని అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని పటిష్టమైన నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ సరఫరా జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రధాన సూత్రధారులను గుర్తించి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డ్రగ్స్ నియంత్రణకు ప్రతి రాష్ట్రం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (రోడ్ మ్యాప్) సిద్ధం చేసుకోవాలని అమిత్ షా సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు.
విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన EAGLE (Elite Anti-Narcotics Group for Law Enforcement) ప్రత్యేక దళం సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. గతంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గంజాయి రవాణాకు పేరుగాంచిన ప్రాంతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాదకద్రవ్యాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రాల మధ్య రైల్వే మార్గాల ద్వారా జరిగే డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగిల్ బృందాలు, శునక దళాలు కలిసి వారానికి మూడుసార్లు విస్తృత తనిఖీలు చేపడుతున్నాయని వివరించారు.
మంగళగిరిలోని ఈగిల్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకమైన సురక్షిత డేటా సెంటర్ను ఏర్పాటు చేశామని, ఇది రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక వ్యవస్థకు కేంద్ర నిఘా కేంద్రంగా పనిచేస్తోందని సీఎస్ తెలిపారు.
ఈ సమావేశంలో ఈగిల్ చీఫ్ ఐజీపీ ఆకె రవికృష్ణ, ఈగిల్ ఎస్పీ ఆపరేషన్స్ కె.ఎం. మహేశ్వర రాజు, విశాఖపట్నం ఎన్సీబీ ఎస్పీ జేడీ పంకజ్, ఎన్సీబీ డీఎస్పీ కిరణ్ తదితర అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సహకారం అవసరమని అధికారులు పేర్కొన్నారు.