Vijayawada: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన సిట్, 13 మంది పోలీసుల స్టేట్మెంట్లు నమోదు!
Vijayawada: సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత వేగవంతం చేసింది. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్న సిట్ అధికారులు శుక్రవారం మరోసారి కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని విచారించారు.
13 మంది పోలీసు సిబ్బంది స్టేట్మెంట్లు నమోదు.. కృష్ణలంక పీఎస్లో సిట్ విచారణ..
సాయికృష్ణ లాకప్లో ఉన్నాడా?.. పోలీసులను ప్రశ్నించిన సిట్..
విజయవాడ: సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్న సిట్ అధికారులు శుక్రవారం మరోసారి కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని విచారించారు.
ఈ సందర్భంగా 13 మంది పోలీసు సిబ్బంది స్టేట్మెంట్లను నమోదు చేసిన సిట్, మే 6 నుంచి మే 8 వరకు పోలీస్ స్టేషన్లో జరిగిన పరిణామాలపై విస్తృతంగా ప్రశ్నించింది. ముఖ్యంగా, ఆ రోజుల్లో సాయికృష్ణను లాకప్లో చూశారా? అతని పరిస్థితి ఎలా ఉంది? విధుల్లో ఎవరు ఉన్నారు? వంటి అంశాలపై వివరాలు సేకరించింది. విచారణ పూర్తయిన అనంతరం నమోదు చేసిన స్టేట్మెంట్లపై సంబంధిత పోలీసు సిబ్బంది సంతకాలను కూడా సిట్ అధికారులు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, కేసులో కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజీ వ్యవహారంపై కూడా సిట్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు చెందిన ఓ హోంగార్డు మొబైల్ ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అయితే సీసీటీవీ కెమెరాల నిర్వహణతో తనకు ఎలాంటి సంబంధం లేదని హోంగార్డు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
మరోవైపు, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న అప్పటి సీఐ నాగరాజును విచారించేందుకు సిట్ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆయన కస్టడీకి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత నాగరాజును ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సాయికృష్ణ మృతి కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు ప్రతి కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్, సాక్ష్యాధారాల సేకరణతో పాటు సంబంధిత అధికారుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత దర్యాప్తు మరింత కీలక దశకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Tags
Be the first to react