కాకినాడలో ‘భారతీయం’.. విద్యార్థులకు చాగంటి కోటేశ్వరరావు కీలక సందేశం!
Chaganti Koteswara Rao: భారత స్వాతంత్ర్య సంగ్రామం కేవలం గత చరిత్ర కాదని, అది ప్రతి భారతీయుడి వారసత్వ సంపద అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మహనీయులు చేసిన త్యాగాల గురించి భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.
‘భారతీయం’ కార్యక్రమం.. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం..
కాలాపాని జైలు నుంచి స్వాతంత్ర్య సమరయోధుల వరకు.. చాగంటి స్ఫూర్తిదాయక ప్రసంగం..
కాకినాడ: భారత స్వాతంత్ర్య సంగ్రామం కేవలం గత చరిత్ర కాదని, అది ప్రతి భారతీయుడి వారసత్వ సంపద అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మహనీయులు చేసిన త్యాగాల గురించి భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.
విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలు, చరిత్ర పట్ల గౌరవాన్ని పెంపొందించే ఉద్దేశంతో కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ‘భారతీయం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు.
దేశ స్వాతంత్ర్యాన్ని ఒక వారసత్వ సంపదతో పోల్చిన చాగంటి కోటేశ్వరరావు.. ఒక తండ్రి జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులను తన పిల్లలు సద్వినియోగం చేసుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారని వివరించారు. అయితే ఆ సంపద వెనుక ఉన్న కష్టం, శ్రమ, విలువలను కూడా పిల్లలు తెలుసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారని చెప్పారు.
అదే విధంగా దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారని, మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక వారి త్యాగం ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యాన్ని అనుభవించడం మాత్రమే కాకుండా దాని విలువను తెలుసుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాలపై ఉందన్నారు.
మన కుటుంబం, వంశం గురించి తెలుసుకున్నట్లే దేశం కోసం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల గురించి కూడా తెలుసుకోవాలని సూచించారు. దేశభక్తి అంటే కేవలం జాతీయ జెండాను ఎగురవేయడం మాత్రమే కాదని, “నేను భారతీయుడిని” అని గర్వంగా చెప్పుకునే స్వేచ్ఛ వెనుక ఉన్న త్యాగాలను గుర్తుంచుకోవడమని వివరించారు.
‘భారతీయం’ అనే పదం గురించి కూడా చాగంటి కోటేశ్వరరావు ప్రస్తావించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలోనే ఈ పదం ప్రాచుర్యంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చిన సమయంలో దేశ భవిష్యత్తుపై నిర్ణయాలు భారతీయులే తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయని గుర్తుచేశారు. “సైమన్ గో బ్యాక్” అంటూ నల్లజెండాలతో ఉద్యమాలు జరిగాయని, అనేక మంది జైళ్లకు వెళ్లారని తెలిపారు. ఈ చారిత్రక సందర్భాల్లో “భారతీయం” అనే భావన బలపడిందని ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్ర్య పోరాట చరిత్రను తరచూ చర్చిస్తేనే పిల్లలకు దాని విలువ అర్థమవుతుందని చాగంటి అన్నారు. లేకపోతే దేశభక్తి, నైతిక విలువలు క్రమంగా బలహీనపడే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
కాలాపాని జైలు త్యాగాలకు ప్రతీక
అండమాన్లోని కాలాపాని జైలు స్వాతంత్ర్య సమరయోధులు ఎదుర్కొన్న కష్టాలకు ప్రతీకగా నిలుస్తుందని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఇరుకైన గదులు, ఒంటరితనం, శారీరక హింస వంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ స్వాతంత్ర్య సమరయోధుల సంకల్పం చెదరలేదని చెప్పారు.
మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాలా లజపతిరాయ్, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు తదితరుల జీవితాలను చదివితే స్వాతంత్ర్యం ఎంతటి త్యాగాల ఫలితమో అర్థమవుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటిష్ పోలీసుల తుపాకీకి ఎదురుగా నిలిచిన ధైర్యం కారణంగా ‘ఆంధ్రకేసరి’గా పేరు పొందారని గుర్తుచేశారు. రైతులకు నీరు అందించాలనే ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిన ప్రకాశం బ్యారేజీ కూడా ఆయన పేరును గుర్తుచేస్తుందని తెలిపారు.
ఘంటసాల దేశభక్తి గీతాల సేవ
ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కేవలం సంగీత ప్రపంచానికే పరిమితం కాలేదని, స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొన్నారని చాగంటి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు అంతిమయాత్రలో పాల్గొని దేశభక్తి గీతాలు పాడుతూ చివరి వరకు వెంట ఉన్నారని చెప్పారు. కళను కూడా దేశసేవకు ఉపయోగించిన మహనీయుడిగా ఘంటసాలను ప్రస్తావించారు.
అదేవిధంగా బంకించంద్ర ఛటర్జీ రచించిన ‘ఆనందమఠం’ వంటి రచనలు దేశభక్తి, క్రమశిక్షణ, దేశం పట్ల బాధ్యత వంటి భావాలను ప్రజల్లో బలపరిచాయని చాగంటి అన్నారు. ‘వందేమాతరం’ కూడా అదే భావజాలానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.
చారిత్రక ప్రదేశాలను సందర్శించాలి
స్వాతంత్ర్య సమరయోధులు జీవించిన జైళ్లు, స్మారకాలు, వారు పోరాడిన ప్రాంతాలకు కూడా దేవాలయాల తరహాలో ప్రాధాన్యత ఇవ్వాలని చాగంటి సూచించారు. ఇలాంటి ప్రదేశాలను సందర్శించినప్పుడు చరిత్రపై ఆసక్తి పెరుగుతుందని, వాటి గురించి తెలుసుకున్నప్పుడు స్వాతంత్ర్య పోరాటం మరింత లోతుగా అర్థమవుతుందని చెప్పారు.
చరిత్రను అర్థం చేసుకున్నప్పుడే దేశభక్తి మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అందుకే పిల్లలకు పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని, స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలను చదివించాలని సూచించారు. అవకాశం ఉన్నప్పుడు అండమాన్ వంటి చారిత్రక ప్రాంతాలకు పిల్లలను తీసుకెళ్లి స్వేచ్ఛ వెనుక ఉన్న త్యాగాలను వారికి వివరించాలని కోరారు.
ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్వాతంత్ర్యం మనకు సులభంగా లభించలేదని, ఎందరో చేసిన త్యాగాల ఫలితంగా దేశానికి స్వేచ్ఛ వచ్చిందనే విషయాన్ని విద్యార్థులు తెలుసుకుంటారని చాగంటి అన్నారు. ఆ త్యాగాలకు తామే వారసులమనే భావన పిల్లల్లో పెరగాలని ఆకాంక్షించారు.
“భారతదేశం మనది. ఈ దేశాన్ని గౌరవించడం, కాపాడడం మన బాధ్యత. దేశ స్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదు.. మన వర్తమానానికి పునాది, మన భవిష్యత్తుకు వారసత్వ సంపద” అని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు.
లోకేష్పై చాగంటి ప్రశంసలు
‘భారతీయం’ కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనను మంత్రి నారా లోకేష్కు వివరించినప్పుడు ఆయన వెంటనే స్పందించారని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలు, చరిత్ర పట్ల గౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించాలనుకున్న విషయాన్ని లోకేష్కు చెప్పినట్లు వివరించారు.
తనతో మాట్లాడిన అనంతరం లోకేష్ తన కారు వద్దకు వచ్చి, డ్రైవర్ను ఉద్దేశించి “పెద్దాయన జాగ్రత్త” అని చెప్పి వెళ్లారని చాగంటి గుర్తుచేశారు. కార్యక్రమం ప్రారంభ సమయానికి ముందుగానే లోకేష్ వచ్చి పాల్గొనడం దేశం, చరిత్ర పట్ల ఆయన చూపుతున్న ఆసక్తికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశభక్తి, విద్యార్థుల్లో నైతిక విలువల పెంపు పట్ల ఆసక్తి చూపుతున్న నారా లోకేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉండటం విద్యార్థుల అదృష్టమని చాగంటి కోటేశ్వరరావు ప్రశంసించారు.
Be the first to react