Chandrababu: డేటా అనలిటిక్స్‌తో పౌర సేవలు మరింత మెరుగ్గా.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు!

Chandrababu: ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలను మరింత మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను విశ్లేషించి అవసరమైన మార్పులు చేస్తే ప్రభుత్వ సేవలు మరింత సమర్థంగా అందుతాయని సూచించారు.

Chandra Babu Naidu
Chandra Babu Naidu

డేటా అనలిటిక్స్‌తో పౌర సేవలు మరింత మెరుగ్గా: సీఎం చంద్రబాబు..

రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. ప్రజా సేవలపై కీలక ఆదేశాలు..

అమరావతి: ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలను మరింత మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను విశ్లేషించి అవసరమైన మార్పులు చేస్తే ప్రభుత్వ సేవలు మరింత సమర్థంగా అందుతాయని సూచించారు.

అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజల భాగస్వామ్యం, శానిటేషన్, ఆన్‌లైన్ సేవలు, వ్యవసాయం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే మంచి ఫలితాలు
వెలిగొండ ప్రాజెక్టు, అల్లూరి విమానాశ్రయం ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్న విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తే వాటికి సానుకూల స్పందన లభిస్తుందని అన్నారు.

ఇదే విధానాన్ని ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా విస్తరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు విస్తృతంగా సమాచారం అందించాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలపై నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

శానిటేషన్‌పై రాజీ లేదు
పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో 20 సార్లు పాల్గొన్నట్లు సీఎం తెలిపారు. పరిశుభ్రత ప్రాధాన్యంపై ప్రజల్లో మరింత లోతైన అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.

సంక్షేమ హాస్టళ్లలో కూడా పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని సూచించారు. ప్రతి నెల మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను హాస్టళ్లకు ఆహ్వానించాలని ఆదేశించారు. హాస్టళ్లలోని పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న ఆహారం, తాగునీరు తదితర అంశాలపై వారికి వివరించాలని సూచించారు.

అన్నా క్యాంటీన్లపై దృష్టి
అన్నా క్యాంటీన్ల ద్వారా దాతలు అన్నార్తులకు అందిస్తున్న సహాయాన్ని కూడా గుర్తించాలని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ఎక్కడ లోటుపాట్లు కనిపించినా వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో బాధ్యులకు ర్యాంకులు ఇవ్వాలని స్పష్టం చేశారు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తై కృష్ణా జలాలు అందుబాటులోకి రావడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందని సీఎం పేర్కొన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రభుత్వానికి మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోకి 
ప్రభుత్వ శాఖలన్నీ వీలైనంత ఎక్కువ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. సమీకృత సేవల విధానాన్ని ఉపయోగించుకుని తక్షణ నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థలను బలోపేతం చేయాలని అన్నారు.

రెవెన్యూతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు జారీ చేసే అన్ని రకాల ధృవపత్రాలను ఆన్‌లైన్‌లోనే అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు
అవేర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో సాగు పరిస్థితిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. పంటల పరిస్థితికి అనుగుణంగా రైతులకు అవసరమైన సూచనలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించేందుకు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని చెప్పారు. ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

భూమిని ఖాళీగా, నిరుపయోగంగా ఉంచకుండా వ్యవసాయానికి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని 5.70 లక్షల ఎకరాల్లో ప్రతి ఎకరాను సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ప్రజల నుంచి పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే దరఖాస్తులను వేగంగా పరిష్కరించడంపైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసిన తర్వాత వాటి పరిష్కారంలో జాప్యం ఉండకూడదని సూచించారు.

ప్రజల అభిప్రాయాలు, డేటా ఆధారంగా పాలనను మరింత సమర్థంగా మార్చుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest