తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్లను పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. తిరుమలలో ప్రతిరోజూ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఇకపై ఆన్లైన్ ‘డే కరెంట్ బుకింగ్’ విధానంలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ నిర్ణయంతో తిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్న క్యూలైన్ ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
కొత్త విధానం ప్రకారం ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయబడతాయి. ఈ టికెట్లు మధ్యాహ్నం 2 గంటల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమలలో దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ఒక్క కుటుంబానికి గరిష్ఠంగా నలుగురికి మాత్రమే (1+3 సభ్యులు) టికెట్ బుకింగ్కు అనుమతి ఉంటుంది. ఈ పరిమితి ద్వారా టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టాలని టీటీడీ భావిస్తోంది.
టికెట్ల బుకింగ్ ప్రక్రియలో ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ తప్పనిసరి చేయడం ద్వారా పారదర్శకతను మరింత పెంచినట్లు టీటీడీ తెలిపింది. ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్డ్ పద్ధతిలో టికెట్లు కేటాయించనున్నారు. దీంతో ఆఫ్లైన్లో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి తొలగిపోతుందని అధికారులు తెలిపారు. ఈ నూతన విధానాన్ని తొలుత నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. భక్తుల స్పందన, సాంకేతిక సమస్యలపై సమీక్ష చేసిన అనంతరం భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటామని టీటీడీ పేర్కొంది.
అదేవిధంగా రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్లను ఇప్పటికే అమలులో ఉన్న ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో కొనసాగిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఈ విధానంపై మూడు నెలల తర్వాత సమీక్ష నిర్వహించి అవసరమైన మార్పులు చేపడతామని తెలిపింది. తిరుపతి విమానాశ్రయంలో రోజూ ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 శ్రీవాణి దర్శన టికెట్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. భక్తులందరూ ఈ మార్పులను గమనించి తమ దర్శన ప్రణాళికలను ముందుగానే రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.