హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మంగళవారం మరో కీలక మైలురాయిని అధిగమించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ట్విన్ ఇంజిన్ 'ధృవ్ ఎన్జీ' (Dhruv NG) హెలికాప్టర్ తొలి విడత ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. గతంలో తలెత్తిన భద్రతాపరమైన ఆందోళనలన్నింటినీ ఈ కొత్త వెర్షన్లో పరిష్కరించామని స్పష్టం చేశారు.
ధృవ్ ఎన్జీ ప్రయోగం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇందులో అనేక మార్పులు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా పౌర విమానయాన అవసరాల కోసం కొత్తగా 'ఎమర్జెన్సీ విండో ఎగ్జిట్'ను ఏర్పాటు చేశామన్నారు. డీజీసీఏ సర్టిఫికేషన్ ప్రక్రియ కూడా సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దేశంలో 300 హెలికాప్టర్లు మాత్రమే ఉండగా, డిమాండ్ మాత్రం 1000 నుంచి 1500 వరకు ఉందని, ఈ కొరతను తీర్చడానికి విదేశాలపై ఆధారపడకుండా 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా హెచ్ఏఎల్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావడంతో, అధికారులు కీలకమైన ట్రయల్ రన్కు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జనవరి 4న భోగాపురం ఎయిర్పోర్టులో తొలి కమర్షియల్ ఫ్లైట్ దిగనుంది.
ఫైనల్ టెస్ట్ రన్లో భాగంగా ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం జనవరి 4న ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఆయనతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీజీసీఏ (DGCA) ఉన్నతాధికారులు అదే విమానంలో ఇక్కడికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. ప్రస్తుతం 95 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం 5 శాతం పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి, ఆగస్టు నెలలో విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జనవరి 4న జరిగే ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతం అయిన తర్వాత, ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విజయనగరం, విశాఖపట్నంతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, పర్యాటక రంగానికి పెద్ద ఊపు లభిస్తుందని అంచనా వేస్తున్నారు.