YS Jagna Padayatra: మావిగన్ మళ్లీ మొదలెట్టాడు రా అయ్యా... ఈ సారి ఎవరో! జగన్ పాదయాత్రకు ముహూర్తం పిక్స్..
YS Jagna : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా వచ్చే ఏడాది జూలైలో వైఎస్సార్ జయంతి రోజున రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే గత పాలనలోని తప్పులను సరిదిద్దుకోకుండా, అమరావతి రాజధాని మరియు అభివృద్ధిపై స్పష్టమైన విధానం లేకుండా, నేతల బెదిరింపు ధోరణి మార్చుకోకుండా చేసే పాదయాత్రల వల్ల ప్రజల్లో ఆదరణ దక్కడం కష్టమేనని రాజకీయ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నికలు రాగానే గుర్తొచ్చే పాదయాత్ర సెంటిమెంట్
తోలు తీస్తాం.. తంతాం అంటూనే ఓట్ల వేట
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లుంది వ్యవహారం!
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సన్నద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది జూలై ఎనిమిదో తేదీ నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కావడంతో, ఆ సెంటిమెంట్ను జోడించి కూటమి ప్రభుత్వంపై పోరు ప్రకటించేందుకు, క్షేత్రస్థాయి క్యాడర్లో సరికొత్త ఉత్సాహం నింపేందుకు వైసీపీ వ్యూహాత్మక బృందం కసరత్తు చేస్తోంది.
దీర్ఘకాలం పాటు ప్రజల్లోనే ఉండేలా ప్రణాళిక
ఈ పాదయాత్రను ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు నిరంతరాయంగా నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గాన్ని, దాదాపు ప్రతి మండలాన్ని తాకేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. అయితే అంతకంటే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించి, ఆ తర్వాత పాదయాత్రను మొదలుపెట్టి కూటమి ప్రభుత్వంపై వచ్చే ప్రజా వ్యతిరేకతను పూర్తిగా అనుకూలంగా మార్చుకోవాలనేది ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
గత వైఫల్యాలపై సమీక్ష లేకపోవడంపై విమర్శలు
అయితే అధికారంలోకి రావడానికి సరైన వ్యూహాన్ని ఎంచుకోవడంలో వైసీపీ నాయకత్వం ఇంకా వెనుకబడి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఘోర పరాజయం పాలై సమయం గడుస్తున్నా, గత ప్రభుత్వం చేసిన తప్పులపై జగన్ ఇప్పటివరకు సరైన అంతర్గత సమీక్ష నిర్వహించలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాను అంతా బాగానే చేశానని, బటన్లు నొక్కి సంక్షేమాన్ని అందించినా ప్రజలు ఓడించారనే భావనలోనే ఉండటం సరికాదని, గత పాలనలో ఉద్యోగుల సమస్యలు, సామాన్యుల్లో ఏర్పడిన అభద్రతా భావమే ఆ ఓటమికి కారణమని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
రాజధాని అమరావతిపై స్పష్టత లేకపోవడం
గతంలో జరిగిన పొరపాట్లను అంగీకరిస్తూ, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామనే స్పష్టమైన రోడ్మ్యాప్ను ఇప్పటికీ ప్రజల ముందు ఉంచకపోవడం పెద్ద లోపంగా మారుతోంది. రాజధాని అమరావతిపై ఇప్పటికీ వైసీపీ వైఖరిలో స్పష్టత లేకపోవడం వల్ల, మళ్లీ అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారేమో లేదా అమరావతి నిర్మాణాన్ని నిర్వీర్యం చేస్తారేమోనన్న భయాందోళనలు ప్రజల్లో కొనసాగుతున్నాయి. కేవలం ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడకుండా పోలవరం, రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఆకర్షణ వంటి అంశాలపై సరైన విజన్ ప్రకటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
హింసాత్మక వ్యాఖ్యలు – క్యాడర్కు తప్ప ప్రజలకు దూరం
పార్టీ నాయకులు, కొందరు కార్యకర్తలు చేసే వివాదాస్పద వ్యాఖ్యలు, బెదిరింపులు కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని విశ్లేషణలో పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామనే తరహా హెచ్చరికలు, సామాజిక మాధ్యమాల్లో పెట్టే రెచ్చగొట్టే పోస్టులు ఉన్మాదంతో ఊగిపోయే కొద్దిమంది కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇవ్వవచ్చేమో కానీ, సాధారణ పౌరులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తాయని స్పష్టం చేశారు. ఈ తరహా దూకుడు ధోరణి మారనంత వరకు ఎన్ని పాదయాత్రలు చేపట్టినా ప్రజలను పూర్తిగా ఆకట్టుకోవడం కష్టమేనని, ఈ పరిస్థితులు పరోక్షంగా అధికార కూటమికి మళ్లీ రాజకీయంగా కలిసివచ్చేలా చేస్తున్నాయని విశ్లేషించారు.
Be the first to react