Politics- లక్ష్యం 2028.. దేశీ ఏసీ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ రారాజు!
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏపీ దూకుడు.. వేలాది మంది యువతకు ఉపాధి ఖాయం…
మంత్రి లోకేష్ ధీమా: తయారీ రంగంలో దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్…
Nara Lokesh: డైకిన్ ఎయిర్ కండిషనింగ్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 నాటికి దేశంలో తయారయ్యే ఏసీల్లో దాదాపు 80 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, శ్రీసిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాలు ఇందుకు వేదికగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ఈ భారీ ప్లాంట్ ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో ఏపీ అగ్రస్థానంలో నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలోనే కియా వంటి దిగ్గజ సంస్థలను తీసుకువచ్చామని, ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగంలో కూడా అదే తరహా విప్లవాన్ని తీసుకురానున్నట్లు లోకేష్ వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పారిశ్రామికీకరణ ఒక్కటే మార్గమని, అందుకే నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంపై దృష్టి సారించామని మంత్రి తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి, వారికి మెరుగైన వేతనాలతో కూడిన ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. రాబోయే నాలుగేళ్లలో ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దేశానికే దిక్సూచిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.