Praja Vedika: పిత్రార్జిత భూమి మాయం.. ఆక్రమణపై ప్రశ్నిస్తే చంపుతామని బెదిరింపులు! బ్రతుకుదెరువు కోసం వలస వెళ్తే.. అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి!
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామానికి చెందిన లక్ష్మీ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఉద్యోగ నియామకాల్లో అత్యధిక మెరిట్ సాధించాను.
- గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల అవకతవకలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు..
- Politics: వైసీపీ నేతల అండతో వెలగా శ్రీనివాసరావు బరితెగింపు.. న్యాయం కోసం పోరాటం..
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామానికి చెందిన లక్ష్మీ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఉద్యోగ నియామకాల్లో అత్యధిక మెరిట్ సాధించాను. ఒక పట్టు శాస్త్రవేత్తగా ప్రభుత్వానికి సేవలందించే పూర్తి అర్హత తనకు ఉంది. కానీ, అప్పటి నియామక బోర్డులు చేసిన తీవ్రమైన తప్పిదాలు, అవకతవకల వల్ల తనకు రావాల్సిన ఉద్యోగం రాలేదు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 16 (ఉద్యోగాల్లో సమాన అవకాశాలు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు) లకు భంగం కలిగిస్తూ తనకు అన్యాయం చేశారు. తాను గర్భవతిగా ఉండి ఎన్నో శారీరక, మానసిక ఇబ్బందులు పడుతూ కష్టపడి చదివి మెరిట్ సాధించాను. ఆ సమయంలో తనకు దక్కాల్సిన ఉద్యోగాలను బోర్డుల నిర్లక్ష్యం వల్ల కోల్పోయాను. దీనివల్ల తన జీవితం, తన కుటుంబ భవిష్యత్తు పూర్తిగా దెబ్బతిన్నాయి. కావున గత ప్రభుత్వ నియామక బోర్డుల తప్పిదాలపై పూర్తిస్థాయిలో 'ప్రత్యేక విచారణ' జరిపించాలని, మెరిట్ ఆధారంగా తనకు రావాల్సిన ఉద్యోగాన్ని ఇప్పించి న్యాయం చేయాలని నేతలు శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆలాడ స్వామినాయుడులకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం కొండల అగ్రహారం గ్రామానికి నూకరత్నం గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ...తమ ఇంటి పక్కనే నివసించే వెలగా శ్రీనివాసరావు అనే వ్యక్తి తనను మానసికంగా, శారీరకంగా తీవ్రమైన టార్చర్ పెడుతున్నాడు. తమ ఇంటి మేడ పైకి చెత్తాచెదారం, మట్టి, పెంకులు విసిరేస్తున్నాడు. బాత్రూమ్ పైపుల లోపలికి రాళ్ళు, మట్టి, గాజు పెంకులు వేసి నీళ్లు రాకుండా జామ్ చేశాడు. దీనివల్ల కనీసం స్నానం చేయడానికి, నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం. దీని గురించి అడిగితే 'నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకోపో' అంటూ దుర్భాషలాడుతున్నాడు. ఈ విషయమై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు కట్టించాము. కానీ, కేసు నమోదై మూడు నెలలు గడుస్తున్నా పోలీసులు అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. స్టేషన్కు వెళ్తే.. వైఎస్ఆర్సీపీ నాయకులను తీసుకువస్తేనే న్యాయం చేస్తామని కొందరు పోలీసులు బాహాటంగానే చెబుతున్నారు. పోలీసుల అండ చూసుకుని నిందితుడు శ్రీనివాసరావు మరింత రెచ్చిపోతున్నాడు. మేడ మీద నుండి అసభ్యంగా బట్టలు ఊడ్చి చూపిస్తూ.. 'పోలీసులు నా వెంట్రుక కూడా పీకలేరు, వాళ్లకు లంచాలు ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తా' అంటూ బహిరంగంగా ప్రాణ బెదిరింపులకు దిగుతున్నాడు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

అనంతపురం జిల్లా పెదవడుగూరుకు చెందిన రంగయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలం, చండ్రపల్లి గ్రామంలో తనకు పిత్రార్జితంగా వచ్చిన భూమి ఉంది. ఖాతా నంబర్: 193, సర్వే నంబర్: 519 లో గల 2.55 ఎకరాల విస్తీర్ణం గల ఈ భూమిపై తనకు పూర్తి హక్కులు ఉన్నాయి. తాను వివాహం చేసుకుని ప్రస్తుతం పెద్దవడుగూరులో నివసిస్తుండటాన్ని ఆసరాగా చేసుకుని, చండ్రపల్లి గ్రామానికి చెందిన మేడిచర్ల శ్రీనివాసులు, వేరుగడ్డ తిరుపాలప్ప అనే ఇద్దరు వ్యక్తులు తన భూమిని అన్యాక్రాంతం చేశారు. అక్రమంగా ఆక్రమించడమే కాకుండా, తన భూమి తనకు కావాలని అడిగితే తనపై దౌర్జన్యం చేస్తూ ప్రాణభయం కలిగిస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులలో, ఆన్లైన్లో స్పష్టంగా తన పేరు మీదనే భూమి ఉంది. కానీ, స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే.. తెల్ల కాగితంపై ఇచ్చే 1-B వస్తోంది కానీ, అధికారికంగా 'మీ సేవ' కంప్యూటర్ ప్రింట్ రావడం లేదని సాకులు చెబుతున్నారు. ఆన్లైన్లో తన పేరును మార్చి, ఆక్రమణదారుల పేర్లు చేర్చేందుకు లోపాయికారీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం నంద్యాలపేట గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సుబ్బరామిరెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. ఉప్పుగుంటపల్లి గ్రామంలో సర్వే నెం. 1405/6 భూమి తమ కుటుంబానికి చెందిన చట్టబద్ధమైన వ్యవసాయ భూమి. ఈ భూమిపై బద్వేల్ ఆర్డీవో గారు కూడా తామే అసలు హక్కుదారులమని స్పష్టమైన ఎండార్స్మెంట్ ఇచ్చారు. కానీ, దీనిని జీర్ణించుకోలేని పెద్దిరెడ్డి ఉపేంద్రరెడ్డి, పెద్దిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి ఈశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి సాయి కుమార్ రెడ్డి, హైదరాబాద్లో ఉంటున్న పెద్దిరెడ్డి సుబ్బిరెడ్డిలు కలిసి తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి నిరంతరం కుట్రలు చేస్తున్నారు. గత మార్చి 23న తాము తమ భూమిలో బోరు వేయడానికి జియాలజిస్టుతో కలిసి వెళ్లగా.. నిందితులు ఆయుధాలతో తమ పైకి వచ్చి అత్యంత అసభ్య పదజాలంతో దూషించారు. 'భూమిలోకి వస్తే చంపేస్తాం, ఒక్క ఫోన్ చేస్తే జమ్మలమడుగు, కొమ్మెర్ల నుండి రౌడీ మూకలు వస్తాయి' అంటూ తీవ్రంగా బెదిరించారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత భూమి దున్నడానికి ట్రాక్టర్ తీసుకెళ్తే.. 'ట్రాక్టర్ దిగితే తగలబెట్టేస్తాం' అని డ్రైవర్ను భయభ్రాంతులకు గురిచేసి పంపించేశారు. మైదుకూరు పోలీసులు వీరిపై బైండోవర్ కేసు నమోదు చేసినా వీరు అస్సలు తగ్గడం లేదు సరేకదా.. తమ భూమిలో అక్రమంగా దూరి భూమి లోపలికి రావడం చట్టవిరుద్ధమని బోర్డులు పెట్టారు.

అంతేకాకుండా చాగనబోయిన కిశోర్, కొంగని నాగేశ్వరరావు, పెరుగు పెద్ద సుబ్బరాయుడు, పెరుగు చిన్న సుబ్బరాయుడు అనే వ్యక్తులు నిందితులతో చేతులు కలిపారు. చాగనబోయిన కిశోర్ తన రాజకీయ ప్రభావాన్ని వాడుకుని తమ అనుమతి లేకుండా తమ భూమిలో అక్రమంగా రోడ్డు వేశారు. అలాగే పెద్దిరెడ్డి సాయి కుమార్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ఎటువంటి ఆర్డర్ లేదా స్టే లేకపోయినా, కేసు తనకు అనుకూలంగా ఉందంటూ ఫేస్బుక్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. తమ అనుమతి లేకుండా తమ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడు. స్థానిక ఎంఆర్వో గారు సదరు భూమిలో ఎటువంటి పనులు చేయవద్దని ఆదేశించినా, వారు బేఖాతరు చేస్తూ అక్రమంగా దున్నకాలు సాగిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

విజయనగరం జిల్లా తెర్లాం మండలం, టెక్కలివలస గ్రామానికి చెందిన బసవ నర్సింగరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ తాత గారి ఆస్తి అయిన సర్వే నెం. 70-10 లో గల 0.58 సెంట్ల మెట్ట భూమి వారసత్వ రీత్యా తనకు సంక్రమించింది. ఈ భూమికి సంబంధించి స్పష్టంగా తన పేరు మీదనే 1-B (వన్-బి), అడంగల్ రికార్డు కాపీలు ఉన్నాయి. అయితే, గత 30 సంవత్సరాల క్రితం బ్రతుకుదెరువు కోసం గుంటూరు జిల్లా మంగళగిరికి వలస వచ్చి రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాను. స్థానికంగా లేకపోవడాన్ని అదునుగా చూసుకుని, కొందరు వ్యక్తులు తన పొలాన్ని ఆక్రమించడమే కాకుండా, లోపాయికారీగా తన సర్వే నెంబరును మార్చి వారి పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. తన భూమి తనకు ఇప్పించమని తెర్లాం తహశీల్దార్ గారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నన్ను పట్టించుకోకుండా, కార్యాలయం చుట్టూ తిప్పుతూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు. దీనిపై విజయనగరం, గుంటూరు జిల్లాల కలెక్టర్ల 'స్పందన' గ్రీవెన్స్లలో విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కబ్జాదారుల దగ్గర స్థానిక ఎం.ఆర్.ఓ, వి.ఆర్.ఓలు భారీగా లంచాలు తీసుకుని తన రికార్డులను తారుమారు చేసి అన్యాయం చేశారు. గతంలో తనకు క్రమంతప్పకుండా వస్తున్న 'అన్నధాత సుఖీభవ' నగదును కూడా ఇప్పుడు రాకుండా నిలిపివేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన నర్సమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 67/1 లో గల 0.96 సెంట్లు, అలాగే సర్వే నంబర్ 674 లో గల 2.64 సెంట్ల పట్టా భూములను గతంలో గిద్దలూరు గ్రామ కాపురస్తుడైన పార్లపల్లి రవికిరణ్ గారికి విక్రయించాను. అయితే, ఆ భూమి పక్కనే సర్వే నంబర్ 68/5 లో తనకు 0.91 సెంట్ల అసైన్మెంట్ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఢీ-పుస్తకం, ఆన్లైన్ రికార్డులు, డీకే రిజిస్టర్లలో స్పష్టంగా తన పేరే ఉంది. ఇటీవల ప్రభుత్వం చేసిన రీ-సర్వేలో కూడా తన పేరిట పాస్ పుస్తకం ఇచ్చారు. కానీ, సదరు పార్లపల్లి రవికిరణ్ తనకున్న అంగబలం, అర్థబలంతో తనకున్న ఈ 0.91 సెంట్ల అసైన్మెంట్ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడు. తన భూమిని తనకు వదిలేయమని అడిగితే.. 'ఇది అసైన్మెంట్ భూమి, తన భూమి పక్కనే కలిసిపోయింది కాబట్టి నాకే చెందుతుంది, నీ దిక్కున్న చోట చెప్పుకోపో' అంటూ రవికిరణ్ నన్ను తీవ్రంగా బెదిరిస్తున్నాడు. దీనిపై గిద్దలూరు తాసిల్దార్ గారికి, ఒంగోలు స్పందన కార్యక్రమాల్లో అనేకసార్లు అర్జీలు పెట్టుకున్నా ఇంతవరకు ఎటువంటి పరిష్కారం చూపించలేదు. దానికితోడు.. 'భూమి సమస్యలో ఉంది, క్షేత్రస్థాయిలో మీరు సాగులో లేరు' అనే నెపంతో గిద్దలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు గత రెండు సార్లుగా తనకు రావాల్సిన అన్నధాత సుఖీభవ నగదును కూడా నిలిపివేశారు. కబ్జాదారుడికి అధికారులు లోపాయికారీగా సహకరిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామానికి చెందిన నౌనేపాటే గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామం పరిధిలోని సర్వే నంబర్: 1182/1 లో గల 2.06 ఎకరాల భూమి తమ పెద్దల ద్వారా తమకు సంక్రమించింది. వారి తదనంతరం వారసత్వ హక్కులతో గత 20 సంవత్సరాలుగా తానే స్వయంగా పెట్టుబడి పెట్టుకుంటూ, ఆ భూమిని సాగు చేసుకుంటున్నాను. ఈ భూమి తన స్వాధీనంలోనే ఉన్నట్లు స్థానిక గ్రామస్తులందరికీ తెలుసు. తనకు ఈ భూమి తప్ప జీవనానికి వేరే ఎటువంటి ఆధారం లేదు. భూమి తన ఆధీనంలో ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తు ఇప్పటివరకు రెవెన్యూ రికార్డులైన వెబ్-అడంగల్, ROR (1-B) నందు తన పేరు నమోదు కాలేదు. ఇప్పటికీ పాత రికార్డుల ప్రకారమే వివరాలు చూపిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చే రైతు సంక్షేమ పథకాలు, పంట నష్టపరిహారం, బ్యాంకుల నుండి పంట రుణాలు పొందే అర్హతను కోల్పోయాను. స్థానిక రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినప్పటికీ నా సమస్య పరిష్కారం కాలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన మాధవి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తాము ఎంతో కష్టపడి, పొట్టకూటి కోసం దాచుకున్న డబ్బులను కాటూరి వెంకయ్య అనే వ్యక్తి మమ్మల్ని నమ్మించి, రకరకాల సాకులు చెప్పి విడతల వారీగా మొత్తం రూ. 12,00,000/- (పన్నెండు లక్షల రూపాయలు) తీసుకున్నాడు. తీరా ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే.. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ, మమ్మల్ని కొడుతున్నాడు. నేను రూ. 13 లక్షలు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎగ్గొట్టడానికి చూస్తూ దౌర్జన్యం చేస్తున్నాడు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన అనూష గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం గురజాల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాసరావు కుమారుడైన అయ్యప్పతో హిందూ సంప్రదాయం ప్రకారం తన వివాహం జరిగింది. పెళ్లికి ముందు తన భర్త హైదరాబాద్లో ఐటీ (సాఫ్ట్వేర్) ఉద్యోగం చేస్తున్నాడని నమ్మబలికారు. పెళ్లి నిశ్చయమైనప్పుడు తన భర్త, మామ శ్రీనివాసరావు, అత్త మల్లేశ్వరి, బావ రామాంజనేయులు తమ పుట్టింటికి వచ్చి రూ. 3 లక్షల కట్నం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని తన తల్లిదండ్రులు ఏసుబోయిన అమరయ్య, అంజమ్మలు ప్రాధేయపడటంతో రూ. 1.50 లక్షల కట్నానికి అంగీకరించారు. పెళ్లి సమయంలో ఆ డబ్బును తన తండ్రి వారికి అప్పగించారు. పెళ్లయిన కొద్దిరోజులకే తన భర్తకు ఎటువంటి ఉద్యోగం లేదనే నిజం తెలిసింది. దీని గురించి నిలదీయగా, తనపై అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టాడు. అతని తల్లిదండ్రులు, అన్నతో పాటు పిన్ని చెవిటి చెన్నమ్మ, మేనమామ చెవిటి వెంకటనారాయణల ప్రోత్సాహంతో నన్ను నిరంతరం కొడుతూ శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. 'నువ్వు తక్కువ కట్నం తెచ్చావ్, వేరే అమ్మాయిని చేసుకుంటే ఎక్కువ డబ్బులు వచ్చేవి' అంటూ గొడవ పడేవారు. తన తండ్రి మరో రూ. 5 వేలు తెచ్చి ఇచ్చి, అంతకంటే ఎక్కువ ఇచ్చుకునే శక్తి లేదని బతిమిలాడినా వినలేదు. చివరికి మూడు నెలల క్రితం నన్ను దారుణంగా కొట్టి ఇల్లాలు అని కూడా చూడకుండా ఇంటి నుండి గెంటివేశారు. పుట్టింటికి వచ్చిన తర్వాత ఊరి పెద్దలైన బారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, తిరుమలపూడి మన్నెయ్య, ఏసుబోయిన సిద్దయ్య ఇతర బంధువుల ద్వారా భర్త వద్దకు కాపురానికి వెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవతలి పక్షం నుండి సరైన స్పందన రాలేదు సరేకదా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ గురజాల సబ్ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు గ్రామానికి చెందిన కృష్ణయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలోని సర్వే నంబర్ 19 లో మొత్తం 16.42 ఎకరాల భూమి కలదు. ఇందులో తమకు మూడు తరాల క్రితం తమ తాతల కాలం నుండి రిజిస్ట్రేషన్ జరిగి ఉంది. ఆ తర్వాత తమ తండ్రి పేరిట, ప్రస్తుతం తన ఇద్దరు కుమారుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యి, స్పష్టమైన ఆన్లైన్ రికార్డులు, పాస్ పుస్తకాలు ఉన్నాయి. తన మొదటి కుమారుడు జె. హరి కుమార్ పేరిట 4.10 ఎకరాలు, రెండో కుమారుడు జి. రాజు కుమార్ పేరిట 3.90 ఎకరాలు.. మొత్తంగా ఈ సర్వే నంబర్ లో తమకు 8.00 ఎకరాల భూమి ఉంది. గతంలో పెద్దల కాలంలో సర్వే నంబర్ 19 లోని భూములకు మధ్య మూడు గట్ల వెడల్పుతో సరిహద్దులు ఉండేవి. ఆ తర్వాతి కాలంలో పక్కన ఉన్న వారు ఆ మూడు గట్లను దున్నేయడం వల్ల తమ భూమి ఒక ఎకరా వరకు పక్కవారి భూమిలో కలిసిపోయింది. అయితే, ఇటీవల ప్రభుత్వం చేపట్టిన శాశ్వత భూహక్కు పథకం రీ-సర్వే లో అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి కొలతలు కొలిచే సమయంలో తనకు కనీస సమాచారం ఇవ్వలేదు, ఎటువంటి నోటీసులూ పంపలేదు. పాత రికార్డులను, తమకున్న రిజిస్టర్ పత్రాలను పరిశీలించకుండానే.. రీ-సర్వే కొత్త పత్రాలలో తమ భూమిని ఒక ఎకరా తగ్గించి (7.00 ఎకరాలుగా) నమోదు చేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన మందమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన కుమార్తె నాగలక్ష్మి భవిష్యత్తు కోసం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం, వెలుగుబంద పంచాయితీ పరిధిలోని మారుతీ నగర్లో స్థలాలు కొనుగోలు చేశాము. మారుతీ నగర్ F-40 లేఅవుట్ లోని సర్వే నంబర్: 349 లో తనకు 500 గజాలు, తన కుమార్తె నాగలక్ష్మి పేరిట మరో 500 గజాల స్థలం ఉంది. వీటికి సంబంధించిన అన్ని రకాల రిజిస్ట్రేషన్ పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు తమ వద్ద పక్కాగా ఉన్నాయి. తమకు ఉన్న ఈ మొత్తం 1000 గజాల స్థలాన్ని కందుల బలరామకృష్ణ అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకున్నాడు. తాము ఆడవాళ్లం అని కూడా చూడకుండా తమ స్థలంలోకి మమ్మల్ని రాకుండా అడ్డుకుంటున్నాడు. ఈ ఘోరమైన కబ్జాపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే కొవ్వూరు (రాజమహేంద్రవరం) సబ్ కలెక్టర్/కలెక్టర్ కార్యాలయాల్లో అనేకసార్లు అర్జీలు పెట్టుకున్నాము. కానీ, ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించలేదు తమకు న్యాయం చేయలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.
Be the first to react