Amaravathi Works: అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం..!!
Minister Narayana about Amaravati works: రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, గడువులోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంపై మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు.
నేలపాడులో మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీ…
పనిచేయడం చేతకాకపోతే తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోండి…
అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి సీరియస్…
Minister Narayana about Amaravati works: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వం తన దూకుడును పెంచింది. గత కొంతకాలంగా పనులు నత్తనడకన సాగుతుండటంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజధాని ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి, నేలపాడులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు సంస్థల నిర్లక్ష్య వైఖరిపై ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, గడువులోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంపై మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నేలపాడు ప్రాంతంలో జరుగుతున్న భవన నిర్మాణాల వద్ద కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటం, యంత్రాల వినియోగం సరిగ్గా లేకపోవడాన్ని ఆయన గమనించారు. "కోట్లాది రూపాయల నిధులు కేటాయించినా, పనులు ఎందుకు వేగవంతం కావడం లేదు? అని నిర్మాణ సంస్థల ప్రతినిధులను నిలదీశారు.
పనుల జాప్యంపై సమాధానం చెప్పలేక తడబడిన కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువుల ప్రకారం పనులు జరగాలి. పని చేయడం చేతకాకపోతే తట్టాబుట్టా సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సదరు నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను తక్షణమే ప్రాజెక్టు నుంచి పంపించేయాలని అక్కడి అధికారులను ఆదేశించారు.
కేవలం హెచ్చరికలతోనే ఆగకుండా, పనుల జాప్యానికి గల కారణాలపై సదరు సంస్థ యాజమాన్యం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సంజాయిషీ ఇచ్చుకోవాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరిస్తే సహించేది లేదు. వెంటనే మీ సంస్థ యాజమాన్యం సీఎంతో మాట్లాడి, జాప్యంపై వివరణ ఇవ్వాలి అని ఆదేశించారు.
రాజధాని పనుల్లో ఇకపై ఎలాంటి జాప్యం జరిగినా కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే కాంట్రాక్టులను రద్దు చేసి కొత్త సంస్థలకు అప్పగించేందుకు కూడా వెనుకాడబోమని మంత్రి స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
Be the first to react