భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్–2025 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నేపథ్యంలో...
ఈ బిల్లుపై పార్లమెంటులో ప్రస్తావించాలని, ప్రవాసీ కార్మికుల హక్కుల రక్షణకు కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యురాలు డికె అరుణకు, తెలంగాణ అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ చెన్నమనేని శ్రీనివాస రావు గురువారం ఢిల్లీలో ఒక వినతిపత్రం సమర్పించారు.
42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేసే యోచనలో ఉన్నది. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతోందని పౌరసమాజ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రవాసీ కార్మికులు కోర్టులను నేరుగా ఆశ్రయించే హక్కు తొలగింపు. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడిపై నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది.
విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం. విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి; 182 రోజుల (ఆరు నెలల) లోపు వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం.
‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వలస కార్మికులకు నష్టం కలిగిస్తాయి.
ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు.
రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం. ఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు. ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.
ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి. 24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.
శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు. ట్రాఫికింగ్ (అక్రమ రవాణా), చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం. విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.
*వలస కార్మికుల హక్కులు కాపాడాలి*
భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో పనిచేయేందుకు ప్రభుత్వం కింది చర్యలు తీసుకోవాలి:
రిక్రూట్మెంట్, వేతనాలు, సామాజిక రక్షణపై అమలు చేయగల హక్కులను పునరుద్ధరించాలి.
రాష్ట్రాలు, పౌరసమాజానికి ప్రాతినిధ్యం కలిగిన వికేంద్రీకృత పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
సులభమైన ఫిర్యాదు వ్యవస్థలు, బలమైన సహాయక సేవలు తప్పనిసరి చేయాలి.
మానవ అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు, హామీగల పరిహారం నిబంధనలు చేర్చాలి.
అన్ని వలస వర్గాలను కవర్ చేసేలా నిర్వచనాలను విస్తరించాలి.