రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇక్కడితో ఆపే ఉద్దేశ్యం లేడని, మరొక ఐరోపా దేశంపై దాడి చేయడానికి సిద్ధం అవుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ హెచ్చరించారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళ్లిన సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికంటే, మరో దిశలో కొత్త యుద్ధానికి సిద్ధం అవుతున్నాడు. అది ఏ దేశం అన్నది ఇప్పుడే చెప్పలేం అని జెలెన్స్కీ స్పష్టం చేశారు.
జెలెన్స్కీ ప్రకారం, రష్యా కావాలనే నాటో దేశాల రక్షణ సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. డెన్మార్క్, పోలాండ్, రొమేనియా గగనతలంలో రష్యా డ్రోన్లు కనబడటం, ఎస్టోనియా గగనతలంలో రష్యా ఫైటర్ జెట్లు ప్రవేశించడం ఇందుకు ఉదాహరణలు అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల పోలాండ్ వైపు 92 డ్రోన్లు ప్రయాణించగా, వాటిలో 19 పోలాండ్ భూభాగంలోకి చేరినట్లు కూడా ఆయన వివరించారు. వీటిని ఎదుర్కొనడంలో ఐరోపా దేశాలు కష్టాలు పడుతున్నాయని జెలెన్స్కీ అన్నారు.
డ్రోన్ దాడులు డానిష్, నార్వేజియన్ సైనిక స్థావరాల దగ్గర కూడా కనిపించాయని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో యూరప్ దేశాలు రష్యా వైమానిక దాడులను అడ్డుకోవడంలో అనుభవం అవసరమని, అందుకోసం ఉక్రెయిన్ తాము నేర్చుకున్న పద్ధతులను పంచుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఉక్రెయిన్ సైన్యం యుద్ధంలో ప్రత్యక్షంగా ఉందని, మేము సాధించిన అనుభవం ఇతరులకు ఉపయోగపడుతుంది అని ఆయన జోడించారు.
ట్రంప్తో తన సమావేశం చాలా బాగుంది అని జెలెన్స్కీ తెలిపారు.ఈ యుద్ధంలో రష్యా సాధించినది తాత్కాలికమేనని, అది విజయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో, ఉక్రెయిన్ 2022 నుంచి కోల్పోయిన భూభాగాలను తిరిగి పొందగలదనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే, అమెరికా టోమాహాక్ క్షిపణులపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, అది సున్నితమైన విషయం అని చెప్పుకొచ్చారు..