మొరాకో పర్యటనలో ఉన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యలపై స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తయినా, అది పూర్తిస్థాయిలో ముగియలేదని ఆయన అన్నారు. ఇంకా ఆపరేషన్ సిందూర్ పార్ట్-2 మిగిలి ఉందని స్పష్టం చేశారు. అయితే అది పాకిస్థాన్ వైఖరిపై ఆధారపడి ఉంటుందని రక్షణ మంత్రి హితవు పలికారు.
రాజ్ నాథ్ సింగ్ మాటల్లో, పాక్ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తూనే ఉంటే, భారత్ చేతులు కట్టుకుని కూర్చోబోదని, తగిన సమయంలో తగిన బదులు ఇస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదం అనే శత్రువు కేవలం ఒక దేశానికే కాకుండా, మొత్తం ప్రపంచానికి ప్రమాదకరమని ఆయన గుర్తుచేశారు. అందుకే భారత్ ఎప్పటికప్పుడు దానిని అరికట్టేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. పాక్ వైఖరి మారకపోతే, భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.
భారత్ ఎల్లప్పుడూ శాంతి, సహజీవనాన్ని కోరుకుంటుందని, కానీ సరిహద్దుల్లో ఉగ్రవాదం పెరిగితే ఆర్మీ నిశ్చయంగా బలంగా ఎదుర్కుంటుందని రాజ్ నాథ్ తెలిపారు. మన సైనికులకు ఉన్న శక్తి, సామర్థ్యం గురించి ఆయన ప్రస్తావించారు. సరిహద్దుల వద్ద ప్రతి చిన్న కదలికను గమనిస్తూ, శత్రువుల యత్నాలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ పార్ట్-2 వ్యాఖ్యలతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపైనా చర్చలు మొదలయ్యాయి. పాక్ ఉగ్రవాదాన్ని కొనసాగిస్తే మళ్లీ భారత్ నుంచి గట్టి బదులు వచ్చే అవకాశం ఉందన్న అర్థం అందరూ గమనిస్తున్నారు. భారత్ ఎప్పుడూ ముందే దాడి చేయదని, కానీ జాతీయ భద్రతకు ముప్పు కలిగితే వెనుకాడదని రాజ్ నాథ్ సింగ్ ఈ సందేశంతో మరొకసారి స్పష్టం చేశారు.
దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని ఆయన మాటల్లో స్పష్టమైంది. భారత్ శాంతి కోసం ప్రయత్నించినప్పటికీ, దానికి ప్రతిస్పందన రాకపోతే చర్యలు తప్పవని ఆయన చెప్పిన మాటలు, భారత్ భవిష్యత్తులో తీసుకోబోయే వ్యూహాలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.