శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఇది నిజంగా ఒక సంతోషకరమైన సమాచారం. ఇప్పటివరకు అయ్యప్ప స్వామి వారి ప్రసాదం పొందడానికి భక్తులు దేవాలయం దగ్గర చాలా సమయం పాటు క్యూలైన్లో నిలబడి వేచి ఉండాల్సి వచ్చేది. ప్రత్యేకంగా శబరిమల వంటి రద్దీగా ఉండే దేవాలయాల్లో ప్రసాదం పొందడం ఒక పెద్ద కష్టమే. కానీ ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండానే ఇంటి నుంచే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని స్వామివారి దివ్య ప్రసాదాన్ని పొందే అవకాశం కల్పించబోతోంది ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) తెలపడం జరిగినది.
ఇంకా ఒక నెలలో ఈ కొత్త సదుపాయం పూర్తిగా అందుబాటులోకి రానుంది. దీనికోసం టీడీబీ ప్రత్యేకంగా కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ అనే కొత్త వ్యవస్థను ప్రారంభించింది. ఈ మాడ్యూల్ సహాయంతో శబరిమల మాత్రమే కాకుండా, ట్రావెన్కోర్ పరిధిలోని మరో 1252 దేవాలయాల ప్రసాదాలను కూడా భక్తులు తమ ఇంటి నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
దేవస్వం బోర్డు తమ కార్యకలాపాలను డిజిటల్ విధానంలోకి మార్చే ఒక పెద్ద ప్రాజెక్ట్లో భాగంగా ఈ ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎన్ కృష్ణకుమార్ మాట్లాడుతూ – శబరిమల వంటి పెద్ద దేవాలయాలకు నేరుగా రావలేని భక్తులకు ఈ సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇకపై ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారా ప్రసాదాన్ని ఆర్డర్ చేసి పొందవచ్చు. వచ్చే నెలలో ఈ కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది అని తెలిపారు.
మొదటగా శబరిమలతో పాటు కొన్ని ప్రధాన దేవాలయాల్లో ఈ సదుపాయం అమలు చేస్తారు. ఆ తర్వాత క్రమంగా మరో నెలలో మొత్తం 1252 దేవాలయాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇలా చేస్తే భక్తులు దేవాలయాలకు వెళ్ళకపోయినా, ప్రసాదాన్ని పొందే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న వారు లేదా వృద్ధులు, చిన్న పిల్లలు, బిజీగా ఉండే భక్తులు ఈ ఆన్లైన్ సదుపాయం ద్వారా సులభంగా లాభపడతారు.
ఈ నిర్ణయం వల్ల భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే ఇబ్బందులు తప్పించుకోగలరు. అలాగే రద్దీ తగ్గుతుంది, ప్రసాదం పంపిణీ కూడా మరింత సులభం అవుతుంది. ఆన్లైన్ బుకింగ్ ద్వారా డబ్బు చెల్లించిన వెంటనే రసీదు వస్తుంది. తర్వాత ప్రసాదం పోస్టు లేదా కొరియర్ ద్వారా ఇంటికి చేరుతుంది.
మొత్తానికి, అయ్యప్ప స్వామి భక్తులకు ఇది ఒక పెద్ద వరం అని చెప్పవచ్చు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఇంటి నుంచే దేవుని ప్రసాదాన్ని పొందగలగడం, భక్తులకు ఎంతో సంతోషం కలిగించే విషయం.