పురపాలక శాఖ మంత్రి నారాయణ టిడ్కో ఇళ్ల నిర్మాణంపై అసెంబ్లీలో వివరాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ వచ్చే జూన్ నెలాఖరు నాటికి 2,61,640 ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ పనులన్నింటికీ మొత్తం 7,280 కోట్ల రూపాయలు అవసరమని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలు కూడా ఈ మొత్తంలో భాగమేనని వివరించారు.
అయన గడచిన ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. 2014-2019 కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 7,01,481 ఇళ్లు కేటాయించగా, వాటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించామని చెప్పారు. అయితే, గత ప్రభుత్వం ఈ సంఖ్యను 2,61,640కి తగ్గించి, 4,39,841 ఇళ్లను రద్దు చేసిందని ఆరోపించారు. ఈ ఇళ్లు ఆధునిక సదుపాయాలతో డిజైన్ చేసినప్పటికీ, వాటిని పూర్తిచేయకుండా వదిలేశారని తెలిపారు.
2019 మే నాటికి 77,350 ఇళ్లు 90 నుంచి 100 శాతం పూర్తిచేశామని నారాయణ చెప్పారు. కానీ గత ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్లలో కూడా మౌలిక వసతులు కల్పించలేదన్నారు. అంతేకాకుండా, 103 యూఎల్బీలలో పనులు ప్రారంభించినప్పటికీ, వాటిని 88 యూఎల్బీలకు పరిమితం చేసి, 15 వేల ఇళ్లను పూర్తిగా తొలగించిందని తెలిపారు. ఇప్పటి వరకు 1,77,546 ఇళ్లు పూర్తయ్యాయని, 84,094 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు.
ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అవసరమైన నిధుల విషయంలో కూడా ఆయన వివరాలు ఇచ్చారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన 3,100 కోట్లు ఇవ్వలేదని, ఇన్ఫ్రా పనులకు మరో 3,302 కోట్లు అవసరమని చెప్పారు. మొత్తం ప్రాజెక్ట్ కోసం 7,280 కోట్ల అవసరం ఉందని అంచనా వేశామని తెలిపారు. దీనికోసం హడ్కో నుంచి 4,450 కోట్ల రుణం, లబ్ధిదారుల ఇళ్లపై 1,725 కోట్ల రుణం, అమృత్ పథకం నిధుల నుంచి 225 కోట్లు, అదనంగా 818 కోట్లను ఇతర మార్గాల్లో సమీకరించేలా ప్రణాళిక వేసినట్లు వెల్లడించారు.
లబ్ధిదారుల సమస్యలపై కూడా మంత్రి స్పందించారు. గత ప్రభుత్వం 52,192 మందిని అనర్హులుగా ప్రకటించి వారికి ఇళ్లు ఇవ్వలేదని తెలిపారు. అంతేకాకుండా, ఇళ్లు ఇవ్వకుండానే లబ్ధిదారుల పేరుపై లోన్లు తీసుకుని, వారిని ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. దీనివల్ల 140 కోట్ల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. ఇళ్లకు రంగులు వేసినా, పార్టీ రంగులతో పూత పూయించారని, దానికి సంబంధించిన బిల్లులు కూడా కాంట్రాక్టర్లకు చెల్లించలేదని పేర్కొన్నారు. వచ్చే జూన్ నాటికి అన్ని ఇళ్లు పూర్తి చేసి, శనివారం రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి నారాయణ తెలిపారు.