ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కొత్త రికార్డు సృష్టించారు. ఈ ఏడాదీ ఎర్రకోట బురుజుల నుంచి ఆయన తన రాజకీయ జీవితంలోనే అత్యంత సుదీర్ఘ ప్రసంగాన్ని చేసి, గత రికార్డును అధిగమించారు. ఈసారి మోదీ ఏకధాటిగా 105 నిమిషాలు ప్రసంగించి అందరిని ఆశ్చర్యపరిచారు.
మోదీ ఈ ఉదయం 7:33 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించి 9:18 గంటలకు ముగించారు, మొత్తం ఘంటా 45 నిమిషాల పాటు ప్రసంగం సాగింది. గత సంవత్సరం 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో నెలకొల్పిన రికార్డును మోదీ ఈసారి బద్దలు కొట్టారు.
ఈ ప్రసంగంతో మోదీ మరో అరుదైన మైలురాయిని కూడా సొంతం చేసుకున్నారు. ఎర్రకోట నుంచి వరుస 12వసారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా నిలిచారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును అధిగమించారు, కాగా అత్యధికంగా వరుస 17 సార్లు ప్రసంగించిన జవహర్లాల్ నెహ్రూ మాత్రమే మోదీ కంటే ముందున్నారు.
గతంలో కూడా మోదీ సుదీర్ఘ ప్రసంగాల కోవలో నిలిచారు. 2016లో 96 నిమిషాలు, 2019లో 92 నిమిషాలు, 2023లో 90 నిమిషాల ప్రసంగాలు చేశారు. అయితే, 2017లో కేవలం 56 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించడం విశేషం.
ఈ సుదీర్ఘ ప్రసంగంలో మోదీ ప్రభుత్వ విజయాలు, ‘నయా భారత్’ నిర్మాణ లక్ష్యాలు, 2047 నాటికి ‘వికసిత భారత్’ సాధించే ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. దేశ ప్రజల ముందే భవిష్యత్ కార్యాచరణను ఉంచుతూ మోడీ దేశ నిర్మాణంలో కొత్త దిశను చూపించారు.