డ్రైవర్ లేకుండా స్వయంచాలకంగా నడిచే బస్సులు ఇక కల కాదు – అవి హైదరాబాద్లో వాస్తవమయ్యాయి. నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ క్యాంపస్లో డ్రైవర్రహిత మినీ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఒక విద్యాసంస్థ ప్రాంగణంలో పూర్తిస్థాయిలో డ్రైవర్లెస్ బస్సులను వినియోగించడం విశేషం.
ఈ సాంకేతికతను ఐఐటీ హైదరాబాద్లోని ప్రత్యేక పరిశోధనా విభాగం ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్’ (టీహన్) పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఆరు సీట్లు, పద్నాలుగు సీట్ల సామర్థ్యంతో రెండు రకాల విద్యుత్ బస్సులు క్యాంపస్లో నడుస్తున్నాయి. గత మూడు రోజులుగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మెయిన్ గేట్ నుంచి క్యాంపస్లోని విభిన్న విభాగాలకు వెళ్లేందుకు ఈ బస్సులనే వినియోగిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే ఈ బస్సుల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మార్గంలో అడ్డంకులు ఎదురైతే వెంటనే గుర్తించి సురక్షితంగా మళ్లిపోతాయి. వేగ నియంత్రణ కోసం అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునాతన సాంకేతికతలను అమర్చారు.
ప్రస్తుతం క్యాంపస్ పరిధిలోనే నడుస్తున్న ఈ బస్సులపై ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సుమారు 90% మంది పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని టీహన్ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ప్రజా రవాణాలో ఈ సాంకేతికత విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు.