దేశంలోని అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఊహించని సొమ్మును సంపాదించింది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లో ఏళ్ల క్రితం పెట్టిన చిన్న పెట్టుబడి, ఇప్పుడు బ్యాంకుకు బంగారు గని అయింది. కేవలం రూ.1.20 కోట్లతో కొన్న వాటా విలువ, షేర్ మార్కెట్లో లిస్టింగ్ అయిన మూడు రోజుల్లోనే రూ.7,801 కోట్లకు ఎగబాకింది.
ఆగస్టు 8న ఎన్ఎస్డీఎల్ షేర్లు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ధర రూ.800 కాగా, 10% ప్రీమియంతో రూ.880 వద్ద మొదలైంది. అప్పటి నుంచి షేర్ దూసుకెళ్తూ, కేవలం 72 గంటల్లోనే రూ.1,300.30 వద్దకు చేరింది. దీంతో ఇష్యూ ధరతో పోలిస్తే 62.5% వృద్ధి నమోదైంది.
ఎస్బీఐ గతంలో ఒక్కో షేరు రూ.2 చొప్పున 60 లక్షల ఎన్ఎస్డీఎల్ షేర్లు కొనుగోలు చేసింది. దీనికి ఖర్చయింది కేవలం రూ.1.20 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఆ వాటా విలువ రూ.7,801.80 కోట్లకు పెరిగింది. అంటే, పేపర్ ప్రాఫిట్ రూపంలో రూ.7,800.60 కోట్ల లాభం… అది కూడా దాదాపు 6,50,050% రాబడి.
ఇక, ఎస్బీఐతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు కూడా భారీ లాభాలు దండుకున్నాయి. ఐడీబీఐ బ్యాంక్ రూ.5.99 కోట్ల పెట్టుబడిని రూ.3,898 కోట్లకు, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా రూ.2.04 కోట్ల పెట్టుబడిని రూ.1,332 కోట్లకు చేర్చుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రూ.36.84 కోట్ల పెట్టుబడిని 105 రెట్లు పెంచుకుని రూ.3,900 కోట్లకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.150.54 కోట్ల పెట్టుబడిపై రూ.1,507 కోట్ల లాభం పొందగా, యూనియన్ బ్యాంక్ రూ.2.66 కోట్ల పెట్టుబడిపై రూ.664 కోట్ల లాభం గడించింది.
ఎన్ఎస్డీఎల్ లిస్టింగ్, దాని తొలి పెట్టుబడిదారులకు నిజంగా బంగారు వర్షం కురిపించింది.