ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయని ప్రకటించారు. గూగుల్ వచ్చే నెలలో విశాఖలో అడుగుపెట్టనుందని, టీసీఎస్ కూడా తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు కర్మాగారం కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థాపించబడనుంది. ఈ నిర్ణయాలతో ఉత్తరాంధ్ర ప్రాంతం పరిశ్రమల హబ్గా మారబోతోందని ఆయన అన్నారు.
రాయలసీమలో కూడా పరిశ్రమల అభివృద్ధి కొనసాగుతోందని సీఎం చెప్పారు. కడప ఉక్కు కర్మాగారం, కొప్పర్తి, ఓర్వకల్లు ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతపురం-కర్నూలు మధ్య లేపాక్షి-ఓర్వకల్లు ప్రాంతం భారీ ఇండస్ట్రియల్ హబ్గా మారబోతోందని చెప్పారు. అలాగే పోర్టులు, విమానాశ్రయాల మధ్య రోడ్డు నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతి 50 కిలోమీటర్లకో పోర్టు లేదా హార్బర్ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కలెక్టర్ల సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ కూడా పెట్టుబడులపై సూచనలు చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్టుబడుల సమస్యలను సమీక్షించాలని, ప్రతి మంగళవారం ‘ఇండస్ట్రీ డే’ నిర్వహించి పరిశ్రమలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పెట్టుబడులు సక్రమంగా జరిగేలా కలెక్టర్లు ముందుకు రావాలని సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే 14 రంగాలకు చెందిన రూ.10.06 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో పునరుత్పాదక విద్యుత్, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలు ఉన్నాయి. ఈ పెట్టుబడులు ఉపాధి అవకాశాలను పెంచి, రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.
కొత్త పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 20 క్లస్టర్లతో పాటు, 30 కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం 1.1 లక్షల ఎకరాల భూమిని గుర్తించారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రిటైర్ అయిన ఉద్యోగుల సహాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక హబ్గా ఎదిగే అవకాశం ఉందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.