విద్యార్థులకు సెలవులు అంటే చిన్నపాటి పండగే. ప్రత్యేకంగా దసరా సీజన్ రాగానే అందరూ ఆతృతగా ఎదురుచూసే విషయం స్కూళ్లకు, కళాశాలలకు సెలవులు ఎప్పుడు వస్తాయన్నదే. ఈ ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉంటాయని ప్రకటించారు. అంటే విద్యార్థులు మొత్తం 9 రోజుల పాటు పండగ సెలవులను ఆస్వాదించనున్నారు. అక్టోబర్ 3న పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ప్రతి సంవత్సరం దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించడం సాంప్రదాయంగా మారింది. ఈసారి కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ సెలవుల్లో హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపే అవకాశం పొందుతారు. అలాగే ఉపాధ్యాయులు కూడా ఈ విరామాన్ని వినియోగించుకోవచ్చు. పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ షెడ్యూల్ను గమనించి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
దసరా సెలవుల ప్రభావం కేవలం విద్యార్థులపైనే కాకుండా, తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులపైన కూడా కనిపిస్తుంది. సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉండే వారు పిల్లల సెలవుల కారణంగా తమ స్వగ్రామాలకు రావడానికి అవకాశాలు వెతుకుతారు. దీంతో పండగ వాతావరణంలో ఊళ్లు, పట్టణాలు కిక్కిరిసిపోయే దృశ్యాలు సర్వసాధారణంగా మారతాయి. రవాణా సదుపాయాలపై డిమాండ్ పెరగడం, పండగ మార్కెట్లలో సందడి మరింత పెరగడం సహజమే.
ఇక తెలంగాణలో మాత్రం విద్యార్థుల ఆనందం మరింత ఎక్కువ. అక్కడి విద్యాశాఖ ప్రకటన ప్రకారం ఈసారి దసరా సెలవులు మొత్తం 13 రోజులు ఉండనున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ సెలవులు కొనసాగుతాయి. అక్టోబర్ 4న బడులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ తేదీలను ఖరారు చేశామని అధికారులు తెలిపారు. అంటే రెండు రాష్ట్రాల విద్యార్థులూ దసరా పండుగను పెద్ద ఎత్తున కుటుంబంతో కలిసి జరుపుకునేలా వీలుగా మారింది.