
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. తాజాగా విడుదలైన మెగా డీఎస్సీ ఫలితాల తర్వాత, ఈ నెలాఖరుకల్లా నియామకాలు పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. సుమారు 16 వేలకుపైగా ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి జూన్–జూలైలో పరీక్షలు నిర్వహించగా, ఫలితాలను ఇప్పటికే ప్రకటించారు. మిగతా ప్రక్రియను త్వరగా ముగించి ఆగస్టు చివరినాటికి నియామకాలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై విస్తృతంగా మాట్లాడారు.
2014–19 మధ్య ఏపీని దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో నిలిపామన్న ఆయన, 2019లో వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడ్డదని విమర్శించారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు, పోలవరం–అమరావతి ప్రాజెక్టుల నిలిపివేత, పెట్టుబడుల ప్రవాహం ఆగిపోవడం వంటి ఉదాహరణలు ఇచ్చారు.
2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్, 57% ఓటు షేర్తో అధికారంలోకి తెచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
సంక్షేమ పథకాలు: ఎన్టీఆర్ భరోసా – 64 లక్షల మందికి పింఛన్లు. తల్లికి వందనం – పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఆర్థిక సహాయం. అన్నదాత సుఖీభవ – 47 లక్షల రైతులకు మద్దతు. దీపం-2 – మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు. స్త్రీ శక్తి – ఉచిత బస్సు ప్రయాణం (నేటి నుంచి అమలు)
ఇకపోతే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నక్యాంటీన్లు పునఃప్రారంభం, నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25,000, 4000 సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కల్లుగీత కార్మికులకు లిక్కర్ షాపులు–బార్లలో 10% రిజర్వేషన్, మత్స్యకారులకు రూ.20,000 సాయం, చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలను చంద్రబాబు వివరించారు.
పారదర్శక, వేగవంతమైన సేవల కోసం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించామని, దీని ద్వారా 700 పౌరసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.