ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పలు కీలక పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు వివరించారు. మహిళలకు ‘స్త్రీశక్తి’ పేరుతో ఉచిత బస్సు ప్రయాణం అందించే కొత్త పథకం ప్రకటించారు. రాష్ట్రంలోని పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించి, ఇప్పటివరకు 204 కేంద్రాల ద్వారా 5.16 కోట్ల మందికి తక్కువ ధరలో భోజనం అందించామని తెలిపారు. నాయీ బ్రాహ్మణుల కనీస వేతనం రూ. 25 వేలకి పెంచి, 40 వేల సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మత్స్యకారులకు వేట విరామంలో రూ. 20 వేల ఆర్థిక సాయం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.
విద్య, ఉపాధి రంగాల్లోనూ ముఖ్యమైన చర్యలు చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. ఈనెలాఖరులోగా మెగా DSC నియామకాలు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు, పవర్లూమ్ యజమానులకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ, ఎస్సీ వర్గీయరణతో వారి దశాబ్దాల ఆశయాన్ని నెరవేర్చామన్నారు. ‘అడవితల్లి బాటలో’ పథకం కింద రూ. 1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేసి, గిరిజన ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తున్నట్లు చెప్పారు.
నీటి వనరుల వినియోగంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. పోలవరం నుంచి గోదావరి వృధా జలాలను బనకచర్లకు మళ్లించడానికి నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం కలగదని స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వచ్చే ఏడాది జులై నాటికి సాగునీరు అందేలా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబరులో పూర్తవుతుందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 12,157 కోట్లు విడుదల చేసిందని వివరించారు. 2028 నాటికి ‘జల జీవన్ మిషన్’ కింద ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
పట్టణాభివృద్ధి, పరిశ్రమల రంగాల్లో కూడా చర్యలు వివరించారు. భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేసి వంద గజాల్లోపు స్థలాల్లో ప్లాన్ అవసరం లేకుండా ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించామని తెలిపారు. 9 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాల ద్వారా రూ. 5.94 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదమిస్తూ, 5.56 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు చెప్పారు. ఆలయ అర్చకుల వేతనాలు పెంచి, ఉచిత ఇసుక విధానం కొనసాగిస్తూ భవన నిర్మాణ రంగాన్ని బలోపేతం చేశామని అన్నారు.
చివరగా… ఆర్థిక, సైనిక శక్తుల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ “మనది గుడ్ ఎకానమీ” అని సీఎం నాయుడు తెలిపారు. దేశ రక్షణలో త్రివిధ దళాల ధైర్యసాహసాలను గుర్తుచేస్తూ, శత్రు దాడులకు మిసైళ్లతో సమాధానం ఇచ్చిన సైనికుల కృషిని సత్కరించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, జలవనరుల సమర్థ వినియోగం—ఈ మూడింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు.