ఏపీ సమగ్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల తొలి దశ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ మౌలిక సదుపాయ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న ఉద్దేశంతో వాటిని వేగవంతం చేసి, ఆర్థిక వనరులుగా మార్చాలని దిశానిర్దేశం చేశారు.
సోమవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రవాణా–సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ను త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోర్టులు, విమానాశ్రయాలు, రహదారులను అనుసంధానించే సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగితే లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి, ఎగుమతి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
పోర్టులు–పారిశ్రామిక ప్రాంతాల అనుసంధానం మెరుగుపరిచేందుకు పీపీపీ పద్ధతిలో రహదారి విస్తరణ చేపట్టాలని సూచించారు. స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతూ, కొన్ని ఫిషింగ్ హార్బర్లను మైనర్ పోర్టులుగా అప్గ్రేడ్ చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టులతో పాటు, జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల తొలి దశ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.