ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన బార్ పాలసీ రూపొందించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 31తో ప్రస్తుత బార్ పాలసీ గడువు ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం కొత్త పాలసీపై శ్రద్ధ పెంచింది. ఈ నేపథ్యంలో మంత్రుల బృందం శుక్రవారం మంగళగిరిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుంచి హైబ్రిడ్ మోడ్లో సమావేశమై, కొత్త పాలసీ రూపకల్పనపై సమగ్రంగా చర్చించారు.
ఈ సమావేశానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత పాలసీ కింద రాష్ట్రంలో 840 స్టాండ్లోన్ బార్లు, 50 స్టార్ హోటళ్లలో బార్లకు లైసెన్సులు మంజూరు చేసినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అంతేకాక, 44 బార్ లైసెన్సులు గడువు ముగిసిన తర్వాత తిరిగి రెన్యువల్ కాకపోవడం వంటి అంశాలపైనా చర్చ జరిగింది.
నూతన పాలసీ రూపకల్పనలో ఇతర రాష్ట్రాల విధానాలపై కూడా అధ్యయనం చేశారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాల్లో బార్ పాలసీలు ఎలా అమలవుతున్నాయన్న విషయాలను సమీక్షించారు. ఏపీ వైన్స్ డీలర్లు, స్టార్ హోటళ్ల అసోసియేషన్లు, హోటల్ యజమానుల సమాఖ్యల నుంచి వచ్చిన వినతులను కూడా ఈ సమావేశంలో పరిగణనలోకి తీసుకున్నారు.
గతంలో అమలైన బార్ లైసెన్సింగ్ విధానాలు, వాటి ఆర్థిక ప్రభావం, ఇప్పుడు తీసుకోబోయే మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలపై మంత్రుల మధ్య చర్చ జరిగింది. ముఖ్యంగా టూరిజం శాఖతో సమన్వయం కల్పించి, కొత్త పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి అనుకూలంగా బార్ పాలసీని రూపొందించాలని మంత్రులు సూచించారు. వీలైనంత త్వరలో ఈ సలహాలు, సూచనల ఆధారంగా తుది బార్ పాలసీ రూపకల్పన చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.