కూటమి అధికారంలోకి వచ్చాక తెదేపా, జనసేన, భాజపా కలిసి తొలిసారి భారీ కార్యక్రమాన్ని చేపట్టాయి. బుధవారం అనంతపురం వేదికగా సూపర్ సిక్స్-సూపర్హీట్ పేరుతో బహిరంగసభ ఏర్పాటు చేశారు. 15 నెలల్లో రాష్ట్రంలో అమలుచేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సభ ఏర్పాటుచేశారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, భాజపా అధ్యక్షుడు మాధవ్ సభకు హాజరుకానున్నారు. ఒకే వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు మూడు పార్టీల ప్రధాన నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. సభకు 3 లక్షలకు పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఆర్టీసీ, ప్రైవేటు కలిపి 3,857 బస్సులను సభ కోసం కేటాయించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, నారాయణ, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, అనిత, సవిత ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
సభ కోసం 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ను దారిమళ్లించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలను వడియంపేట వద్ద, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఎన్ఎస్ గేటు వద్ద నుంచి మళ్లించారు.
శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం సభ ప్రాంగణంలోనే కమాండ్ కంట్రోల్ రూంను సిద్ధం చేశారు. సభ కోసం ఇప్పటికే ఉన్న 400 సీసీ కెమెరాలను వినియోగించుకోవడంతో పాటు కొత్తగా మరో 250 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.
సభాప్రాంగణం, వేదిక, హెలిప్యాడ్, ప్రముఖులు పర్యటించే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, డైవర్షన్ పాయింట్స్, సభకు వచ్చి వెళ్లే మార్గాలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించి తదనుగుణంగా చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు.